రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను వైఫై నగరంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే. తారకరామారావు ఐటీకి సంబంధించిన ఉన్నతాధికారులతో వరుస సమీక్షాసమావేశాలు జరుపుతున్నారు. మరో ఆరు నెలలలో హైదరాబాద్ పూర్తి స్థాయి వైఫై నగరంగా మారబోతోంది. అంతేకాకుండా తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని సేవలను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ సెల్ కంపెనీలు హామీ ఇచ్చాయి. సాధ్యమైనంత త్వరగా హెచ్ఎండీఏ పరిధిలో వైఫై సదుపాయాన్ని విస్తరించాలని, 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధులను కోరారు.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వైఫై సదుపాయం ఉంది. హైదరాబాద్ లో కనుక ఈ సేవలు అందుబాటులోకి వస్తే అమెరికా తర్వాత ఆ ఘనత సాధించిన రెండవ నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సౌకర్యం పూణేలో ఉన్నా అది కొద్ది ప్రాంతానికే పరిమితమైంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ ప్రాజెక్టు విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్, హెచ్ఎండీఏ కమిషనర్ నీరజ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా తెలంగాణరాష్ట్రంలో త్వరలో రాబోయే 4జీ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కేబుల్స్ వేయడం, టవర్స్ నిర్మాణం వంటి పనులు ఊపందుకున్నాయి. మున్సిపాలిటీల్లో ఇప్పటికే 70శాతం పనులు పూర్తవగా, హైదరాబాద్ లో 50శాతం పనులు పూర్తయినట్లు ఐటీ అధికారులు తెలిపారు.
మరోవైపు ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మూడు నెలల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం లో కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ కంటే ముందుగా వీలైనంత త్వరగా హైదరాబాద్ లో ఈ ప్రాజెక్టును అమలులోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో మూడుసార్లు చర్చలు జరిపారు.
ఈ విషయమై ఐటీ కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, భూసేకరణ ఇంకా ప్రారంభం కాలేదని, ఏ ప్రాంతాలను ప్రాజెక్టు కేంద్రాలుగా చేయాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఐటీఐఆర్ రీజియన్ పరిధిలో స్కూళ్ళు, ఆస్పత్రులు, కళాశాలలు వంటి సదుపాయాలు ఉండాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిపారు.