mt_logo

కొంచెపు బుద్ధి!

చంద్రబాబు శక్తియుక్తుల వల్ల కేంద్రం లక్షల కోట్లు కుమ్మరిస్తుందనే ప్రచారం సాగింది. తీరా బొటాబొటి ఓట్లతో అధికారానికి వచ్చిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలో పాలుపోవడం లేదు. తెలంగాణ వంటి పండ్ల గంప అందుబాటులో లేదు. ఎటూ తోచని స్థితిలో తెలంగాణతో గిచ్చి కయ్యానికి దిగి తమ రాష్ట్రానికి ఏదో ఒరగబెడుతున్నట్టు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇటువంటి చర్యల ద్వారా విజ్ఞత గల సీమాంధ్ర ప్రజలను ఎల్లకాలం నమ్మించడం సాధ్యం కాదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలే తప్ప గొడవలు పడడం వల్ల దేనికీ లాభం చేకూరదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అకారణంగా తెలంగాణపై విషం కక్కుతున్నారు. నిన్నగాక మొన్న గవర్నర్‌కు అదనపు అధికారాలు అంటూ హైదరాబాద్‌లో తలదూర్చడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒనగూడిన ప్రయోజనమేమిటో ఆయనకే తెలువాలె. మళ్ళా పీపీఎల రద్దు అంటూ కొత్త లొల్లి ముందు పెట్టారు. యధాతథ పరిస్థితి కొనసాగించమని విద్యుత్ నియంత్రణ సంస్థ హితవు చెప్పినా వినకపోవడంతో వివాదం కేంద్రం దగ్గరకు చేరింది. ఇప్పుడు ఎంసెట్ ఆధారిత ప్రవేశాలపై వివాదం చేస్తున్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రాజెక్టులకు కొర్రీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందరం తెలుగువారమే అని సుద్దులు చెబుతూనే ఈ తొండి వేషాలేమిటి?

విద్యారంగంలో పదేండ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలని విభజన చట్టంలో పెట్టించింది సీమాంధ్ర పాలకులే. ఇప్పుడు ఫీజుల చెల్లింపు విషయం తేల్చకుండా అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప అది సాధ్యం కాదు. వివాదం కోర్టులో ఉన్నదనేది కూడా తెలిసిందే. నాలుగవ తేదీన కోర్టు వాయిదా ఉంది. ఇంతలోనే ఉన్నత విద్యా మండలి ఉరుకులు పెట్టడం దేనికి? ఇక నదీ జలాల విషయానికి వస్తే, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. గోదావరి నదిపై ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. వీటికి కేంద్ర అటవీ, పర్యావరణ ఆమోదం, కేంద్ర జల సంఘం దశలవారీ అనుమతులు లభించాయి. అయినా సరే, విభజన చట్టం ప్రకారం ఏర్పడే సంస్థ అనుమతి ఉండాలనడం సమర్థనీయం కాదు. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడడానికి ముందే బూర్గుల రామకృష్ణారావు హయాంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం అనుమతులు లభించాయి. నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులు అమలు చేయాల్సిందే. కానీ తెలంగాణ ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదు. దీనికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన వాటికి కూడా అడ్డుపుల్ల వేయాలని చూడడం, ఇతరులు చల్లగా ఉంటే చూడలేని పుల్లగండితనమే తప్ప మరొకటి కాదు.

తెలంగాణ జనం బతకనే కూడదంటే ఎట్లా?
చంద్రబాబు చెడగొట్టు బుద్ధికి ఇంకో ఉదాహరణ- విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఎ)ను రద్దు చేసుకోవడం. విభజన చట్టం ప్రకారం- గత ఐదేండ్ల వినియోగం ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపు నిర్ణయించారు. ఈ ప్రాతిపదికను ఉల్లంఘిస్తూ పీపీఏలను రద్దు చేసుకోవడం వల్ల తెలంగాణకు 460 మెటావాట్ల విద్యుత్ సరఫరా తగ్గుతుంది. ఈ విద్యుత్ కొరతను తీర్చుకోవడానికి రెండేండ్లు పడుతుంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి తెలంగాణ రాష్ట్రం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నది. పీపీఎల రద్దు వల్ల తెలంగాణకు భారీ నష్టమేమీ జరగదు, అట్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. అక్కడి నుంచే వచ్చే విద్యుత్‌కు రేటు ఎక్కువ కనుక దీర్ఘకాలికంగా ఈ ఒప్పందాలు వారికి లాభమే. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ఈ దివాలాకోరు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? తెలంగాణను ఏదో విధంగా రెచ్చగొట్టాలనే కుత్సితపు బుద్ధి! అసలు తెలంగాణకు విద్యుత్ కొరత ఉందంటే అది సీమాంధ్ర పాలకుల నిర్వాకమే. తెలంగాణలోనే విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువ. నీళ్ళు, బొగ్గు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. అయినా సరే సీమాంధ్రలో విద్యుత్ కేంద్రాలు ఎందుకు నెలకొల్పారనే ప్రశ్నకు చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలె. తెలంగాణను ఇరుకున పెడుతున్నాననే అల్పానందంలో చంద్రబాబు అతి ముఖ్య విషయం ఒకటి మరిచిపోతున్నాడు. సీమాంధ్ర రాజధాని కార్యాలయాలు ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. తమ కార్యాలయాలకు విద్యుత్ కోసం తెలంగాణపైనే ఆధారపడుతున్నారు. కేంద్రానికి ఈ కారణం చూపి తెలంగాణ అదనపు విద్యుత్ కూడా పొందవచ్చు. ఈ మొత్తం వివాదంలో- నిజంగా పంతానికి పోతే ఇరుకున పడేది తామేననే సోయి కూడా చంద్రబాబుకు లేదు!

చంద్రబాబు ఇటువంటి పనికిరాని నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అనూహ్యమేమీ కాదు. సీమాంధ్ర ప్రజలను భయాందోళనలలో ముంచెత్తిన మీడియా, పెద్దలు, ఆధిపత్యవర్గాలవారు చంద్రబాబు ఒక్కడే సమర్థుడని, ఆయనే ఆ రాష్ట్రాన్ని గట్టెక్కించగలడని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. చంద్రబాబు శక్తియుక్తుల వల్ల కేంద్రం లక్షల కోట్లు కుమ్మరిస్తుందనే ప్రచారం సాగింది. తీరా బొటాబొటి ఓట్లతో అధికారానికి వచ్చిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలో పాలుపోవడం లేదు. తెలంగాణ వంటి పండ్ల గంప అందుబాటులో లేదు. ఎటూ తోచని స్థితిలో తెలంగాణతో గిచ్చి కయ్యానికి దిగి తమ రాష్ట్రానికి ఏదో ఒరగబెడుతున్నట్టు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇటువంటి చర్యల ద్వారా విజ్ఞత గల సీమాంధ్ర ప్రజలను ఎల్లకాలం నమ్మించడం సాధ్యం కాదు. తెలంగాణతో విరోధం పెరగడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ ఉండదు. ఇప్పటికైనా చంద్రబాబు కుచేష్టలు మాని ఎంతో కొంత తమ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించడం మంచిది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *