ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ చంద్రవదన్ తో గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, మీడియాలో పనిచేసే జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు అందజేస్తుందని, హైదరాబాద్ లో అన్ని హంగులతో కూడిన జర్నలిస్టు భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో తెలంగాణ ప్రెస్ అకాడమీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేసుకోవాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా ఆంధ్రా ధోరణి కనిపిస్తుందని, అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు అకాడమీ చొరవ చూపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. అకాడమీ నిర్వహణకు నిధుల కొరత లేకుండా చూస్తామని, ఇప్పటికే 10కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు.