mt_logo

కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్‌లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడివి?: హరీష్ రావు

మల్లన్న సాగర్‌కు రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు విడుదలైన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రాజెక్టును సందర్శించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ 21 టీఎంసీల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి కడుపు నిండినంత సంతోషం కలిగింది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, కాళేశ్వరం మునిగిపోయిందనే వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెబుతున్నది అని పేర్కొన్నారు.

లక్ష కోట్లు వృధా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అబద్ధం అని గలగల పారుతున్న గోదావరి నీళ్ళే సమాధానం చెప్తున్నాయి. కాళేశ్వరం కొట్టుకుపోయి ఉంటే ఈరోజు మల్లన్న సాగర్‌లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను? అని అన్నారు.

ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడంవల్లే సాధ్యమైంది. మల్లన్న సాగర్ నిండుకుండలా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా అని అడిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతి పంటలో కేసీఆర్ పేరు ఉంది. ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది. కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖుపు ప్రచారాన్ని కాంగ్రెస్ మానుకోవాలి అని హితవు పలికారు.

కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణలో మూడు టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో మూడు టీఎంసీలు, మల్లన్న సాగర్లో 21 టీఎంసీలు నింపుకున్నాం. కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నాం అంటే ఇది కేసీఆర్ గారి కృషివల్లే సాధ్యమైంది అని హరీష్ రావు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికి దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్, మాదేమో రైతులకు నీళ్లు ఇయ్యాలనే తపన. మాది వాటర్ డైవర్షన్, కాంగ్రెస్దేమో అటెన్షన్ డైవర్షన్. 21 టీఎంసీలతో సముద్రాన్ని తలపించే మల్లన్న సాగరే కాళేశ్వరానికి సజీవ సాక్ష్యం అని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చి మల్లన్న సాగర్‌లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి. నీళ్లతో మెదక్ జిల్లా, యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లాల్లో పంటలు పండడం మీకు ఇష్టం లేదా? రైతుల పొలాలు పండడం మీకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు.

రైతులకు నీళ్లు వచ్చిన సంతోషంతో గోదావరి జలాలకు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుందామని వచ్చాం. దాన్ని కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. మల్లన్న సాగర్‌లో మొదటిసారి 21 టీఎంసీ నీళ్లు నిండడం చూసి చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.

మల్లన్న సాగర్ పూర్తయింది. కాలువలు కూడా 90% పూర్తయ్యాయి. మిగతా పది శాతం పిల్ల కాలువలను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. యాసంగి పంటకు బ్రహ్మాండంగా మూడు నాలుగు జిల్లాలకు నీళ్లు రాబోతున్నాయి అని తెలిపారు.

రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు మంచినీళ్లు తీసుకపోతా, మూసికి నీళ్లు తీసుకుపోతా అని అంటున్నాడంటే అందుకు కేసీఆర్ గారు కట్టించిన కాళేశ్వరం మల్లన్న సాగరే దిక్కు అయింది కదా. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మూసిని శుభ్రం చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌కు తాగునీరు మల్లన్న సాగర్ నుంచి అందిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఎట్ల సాధ్యమవుతుంది అని హరీష్ రావు అడిగారు.

అది మల్లన్న సాగర్ కాళేశ్వరం వల్లే సాధ్యమైతున్నది అన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఎన్నికల ముందు అబద్ధాలు ప్రచారం చేశారు. లక్ష కోట్లు వృధా అయ్యాయని సర్వం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేశారు. అయిందే రూ. 93,000 కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్లు వృధా అయ్యాయని విష ప్రచారం చేశారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అని ధ్వజమెత్తారు.

ఇంకా అబద్ధాలను నమ్మి అబద్దాలను ప్రచారం చేసేవాళ్లు మల్లన్న సాగర్ కొచ్చి చూడండి.. పోయినసారి ఆగస్టు నెలలో చేప పిల్లలు వేసాం. ఈసారి సెప్టెంబర్ చివరికి వచ్చినా ఇప్పటివరకు చేప పిల్లలు పంపిణీ చేయలేదు అని దుయ్యబట్టారు.

కేసీఆర్ పుణ్యమా అని చెరువులు మంచిగైనాయి. నదులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు. అన్ని చెరువులు నిండుకుండలా ఉన్నాయి. ఎప్పటిలోగా చేప పిల్లల పంపిణీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. అన్ని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో రొయ్యలు, చేపలు వేసి బెస్త, ముదిరాజ్ సోదరులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.