mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విషజ్వరాలకు బలవుతున్న ప్రజలు: హరీష్ రావు

డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతున్నది అని దుయ్యబట్టారు.

ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణ కొనసాగించాలని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే కోరాము. కానీ ప్రభుత్వం మా సూచనలను పెడచెవిన పెట్టింది. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావు అని పేర్కొన్నారు.

ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించ లేదు. దోమల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం పడకేసింది అని విమర్శించారు.

మరోవైపు పంచాయతీలకు నిధులు విడుదల చేయయపోవడంతో గ్రామాలు మురికికూపాలుగా మారుతున్నాయి. సొంత జేబుల నుంచి ఖర్చు చేస్తూ వచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఇక తమ వల్ల కాదని సామూహికంగా సెలవులు పెడుతున్నారు, విధులకు దూరంగా ఉంటున్నారు అని హరీష్ రావు అన్నారు.

ప్రభుత్వ సమీక్షలు లేక, నిధులు విడుదల చేయక, పారిశుద్ధ్య నిర్వహణ జరగకపోవడంతో దోమలు విజృంభించి విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ధ్వజమెత్తారు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. మొద్దు నిద్ర వీడటం లేదు. పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లడానికే ప్రాధాన్యమిస్తున్నది అని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్దత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.