mt_logo

డయాగ్నస్టిక్ కేంద్రాల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించలేని దుస్థితి: హరీష్ రావు

తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.

రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య  పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అని పేర్కొన్నారు.

కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది  నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న  వైద్యులకు,సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ తెలిపారు.