mt_logo

మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం: హరీష్ రావు

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని శాసనమండలి చీఫ్ విప్‌గా నియమించడంపై మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదిబని మండిపడ్డారు.

బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడటం చీఫ్ విప్‌ బాధ్యత. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు? అధికార పార్టీ సభ్యులకా.. ప్రతిపక్ష పార్టీ సభ్యులకా? ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్‌ను పాటిస్తాడా అని ప్రశ్నించారు.

విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్. ఎదుటి పార్టీ వారిని చీఫ్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్‌కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.

పీఏసీ చైర్మన్, చీఫ్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతున్నది. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ గారే చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారు. అలా చెప్పి మళ్లీ మా పార్టీ వాళ్లు కాదు అని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 38 మంది అని వాళ్లే చెప్తారు, మళ్ళీ మా వాళ్లు కాదు అని చెబుతారు అని అన్నారు.

చైర్మెన్ గారి దగ్గర మహేందర్ రెడ్డి గారి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్‌గా అదే కౌన్సిల్ చైర్మన్ బులిటెన్ ఎలా ఇష్యూ చేస్తారు. ఆయన అనర్హత పిటిషన్‌లో చైర్మన్ ఇచ్చిన బులిటెన్ ఇంప్లీడ్ చేస్తాం అని తెలిపారు.

మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు. పార్టీ ఫిరాయింపు చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది. మార్చి 15 నాడు చీఫ్ విప్ అని ఆర్డర్ ఇస్తే.. పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17 ఎమ్మెల్సీగా జెండా ఎగురేస్తారని జీఏడీ అఫీషియల్ జీవో ఎలా ఇస్తుంది అని హరీష్ రావు అడిగారు.

పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలి అని డిమాండ్ చేశారు.