mt_logo

టెట్ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

టెట్ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి అని సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.

లేఖ యధాతథంగా 👇

గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయు విషయం ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల కాలంలో టెట్ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7 లక్షల మంది డీఎడ్, బీఎడ్ విద్యార్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. అంతేకాకుండా గత డిసెంబర్ నెలలో డీఎడ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా 50 వేల పైచిలుకు మంది ఉంటారు.

టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనే విషయం మీకు తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదు. టెట్ పరీక్ష కోసం దాదాపు 7 లక్షల పైచిలుకు మంది ఎదురుచూస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించి, డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని ఆశతో ఉన్నారు. కాబట్టి, డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు, టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని మనవి చేస్తున్నాను.