తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అటవీభూముల బదలాయింపుకు సంబంధించి తుది అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులతో అటవీ భూముల బదలాయింపుకు సంబంధించి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీతారామ ప్రాజెక్టుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,531 హెక్టార్ల అటవీ భూమి బదిలీ అయింది. మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లకు చెందిన భూమి బదలాయింపు చేశారు. కాల్వలు, సొరంగాల తవ్వకం, విద్యుత్ లైన్ల కోసం భూమి బదిలీ చేశారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 204 హెక్టార్ల అటవీ భూమిని బదిలీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్ కు చెందిన భూమిని మొదటి ఎత్తిపోతల పంప్ హౌస్, నార్లాపూర్ జలాశయం పనులకోసం బదలాయింపు చేశారు. నార్లాపూర్-ఏదుల జలాశయాల మధ్య సొరంగం పనులకోసం అటవీ భూమిని బదిలీ చేశారు. ఈ నేపధ్యంలో ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లకు భూ బదలాయింపునకై ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.