mt_logo

డొల్ల నాయకత్వం, చిల్లు వాదనలు..

BY: కట్టా శేఖర్‌రెడ్డి

తెలంగాణ కోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా ఇప్పుడు కొత్త జెండాలు ఎజెండాలు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తామని చెబుతుంటే విస్మయం కలుగుతున్నది. ఇప్పటికీ మేము తెలంగాణ పక్షం అని చెప్పుకోలేని రాజకీయ పరాన్నజీవులు పొద్దున లేస్తే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఆధిపత్య శక్తులకు పాదపూజ చేస్తూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సుభాషితాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జయాపజయాలను అంచనా వేయడానికి చాలా సమయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పనితీరును అంచనావేయడానికి ముందుగా తెలంగాణ ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. తెలంగాణ సమస్యలపై తమ నిజాయితీని ప్రకటించాలి.

నాయకుల్లో డొల్లతనం ఉంటే అది రాష్ట్రానికి నష్టం. నాయకులను చూసే జనం కదులుతారు. నాయకులు మార్గదర్శకులు కావాలని జనం ఆశిస్తారు. నాయకులు తమకంటే జ్ఞానవంతులై ఉండాలని జనం కోరుకుంటారు. తెలంగాణ విజయం సాధించింది అక్కడే. స్వరాష్ట్ర నినాదానికి దేశం మొత్తం ఆమోదాన్ని సాధించడం అంటే అది భావజాల విజయమే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ట్రాన్ని సాధించి ప్రజామోదంతో పాలనా పగ్గాలు చేపట్టిందీ ఈ భావజాలానికి నాయకుడుగానే. తెలుసుకునే సాధన ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిరంతరం శోధించేవారు, తెలుసుకునేవారు మిగిలినవారి కంటే ఉన్నతంగా ఉంటారు. మంచి వినవద్దు, మంచి తెలుసుకోవద్దు, మంచి మాట్లాడవద్దు అని భీష్మించుకునే నాయకులు ఇప్పుడే కాదు ఎప్పుడూ కొరగాకుండా పోతారు.

తెలంగాణ ధన రాజకీయాల కాలాన్ని జయించి జ్ఞాన రాజకీయాలకు పట్టం గట్టింది. తెలంగాణ సమాజం గురించి తెలిసినవాళ్లు, తెలంగాణ సమస్యల గురించి అవగాహన ఉన్నవాళ్లు, ఆ సమస్యలకు పరిష్కారం తెలిసినవాళ్లు ఇవ్వాళ అత్యధిక శాతం మంది ప్రజాప్రతినిధులుగా వచ్చారు. అయినా తెలంగాణ ఉద్యమం నుంచి కానీ, ఈ పద్నాలుగు మాసాల పాలన నుంచి కానీ ప్రతిపక్షాలు ఒక్క గుణపాఠం కూడా నేర్చుకోలేదు. అదే డొల్లతనం. అదే రాజకీయ పిపాస. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలి. కొందరు నాయకుల్లో ఇది ఉన్మాదస్థాయికి చేరుకుంది. వారి ఉన్మాదం ఎవరికి మేలు చేస్తుందో, చివరికి వారికయినా మేలు చేస్తుందో లేదో తెలియని దుస్థితికి వారు జారిపోతున్నారు. తన, మన గుర్తించలేని రాజకీయ అంధత్వం, వంధ్యత్వం వారిని కమ్ముకున్నది. ఇంకొందరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు.

వారు ఎంత యాంత్రికంగా రాజకీయాలు నడుపుతున్నారో ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. రవీంద్రనాథ్ టాగూర్ వర్ధంతి అని ఎవరో చెప్పారట. పీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్షం నాయకుడు…ఒక్కరేమిటి ముఖ్య నాయకులంతా హాజరై ఆఫీసులో టాగూర్ ఫొటో పెట్టి పూలమాలలు వేశారు. భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించారు. ఆ తర్వాత ఎవరో గుర్తించి టాగూర్ వర్ధంతి ఎప్పుడో ఆగస్టులోనే జరిగిపోయిందని చెప్పారట. అప్పుడు ఒకరిపై మరొకరు తప్పును నెట్టుకునే ప్రయత్నం చేశారట. ఇదొక్కటే కాదు. ఇప్పుడే కాదు. ఉత్సవాలయినా, సమస్యలయినా వారిది ఎప్పుడూ యాంత్రిక స్పందనే. అర్థం చేసుకుని, ఫీలయ్యి చేసింది చేసేది ఒక్కటీ కనిపించదు. ఒక తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు నీటిపారుదల మంత్రిగా పోతిరెడ్డిపాడుకు జెండా ఊపి వస్తాడు. అదే నాయకుడు తెలంగాణకు ఎందుకూ పనికిరాని దుమ్ముగూడెం-టెయిల్‌పాండు ప్రాజెక్టుకు డూడూ బసవన్నలాగా తలూపివస్తాడు. మరో నాయకురాలు హంద్రీ-నీవా ప్రాజెక్టుకు వచ్చిన మహానాయకులకు నివాళి పడుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నీటిపారుదల ప్రాజెక్టులంటే కాంట్రాక్టులు, ప్యాకేజీల భాష తప్ప ఎంత నీరు తేవాలి? ఎన్ని ఎకరాలు పారించాలి? ఎంత తొందరగా పూర్తి చేయాలి? అన్న ధ్యాస లేకుండాపోయింది. మహామహా నాయకులమని రొమ్ము విరుచుకునే నాయకులు ఒక్కరు కూడా తెలంగాణపైన, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంపైన దాడులు చేస్తుంటే రాజశేఖర్‌రెడ్డిని లేదా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎదిరించిన పాపాన పోలేదు. ఆంధ్ర నాయకత్వం సచివాలయం అడ్డాగా అనేక కుట్రలుచేస్తున్నా వారు మాట్లాడలేదు. వందలాదిమంది పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తున్నా వారు స్పందించలేదు. వారంతా ఇలా చేయడానికి వారి రాజకీయ అవకాశవాదం ఒక కారణం అయితే భావజాలానికి సంబంధించిన డొల్లతనం మరో కారణం. వారు ఈ ప్రాంతానికి జరుగబోయే నష్టాలను గుర్తించలేదు. చివరికి తమకు జరుగబోయే నష్టాన్ని కూడా వారు గుర్తించలేకపోయారు.

అందుకే ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎత్తిన జెండా దించకుండా పోరాడిన కేసీఆర్‌కు ప్రజలు వరమాల వేశారు. తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు మాసాల్లోనే మన ప్రభుత్వానికి, మంది ప్రభుత్వానికి తేడా ఏమిటో చూపించగలిగింది. నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతాలు జరుగవు. కానీ కేసీఆర్ కొన్ని అద్భుతాలు చేసి చూపించారు. కరెంటు కోత అనేమాట వినిపించకుండా చేశారు. ఎంత కష్టమైనా నష్టమైనా ఇచ్చే విద్యుత్ నాణ్యంగా, ఒక పద్ధతి ప్రకారం సరఫరా అయ్యేట్టు చూడాలని టెక్నోక్రాట్స్ అయిన మన విద్యుత్ అధికారులకు చెప్పారు. తెలంగాణ వచ్చినంతనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. కేవలం నాయకుడి చిత్తశుద్ధి, మన అధికారుల అంకితభావం కారణంగానే ఇది సాధ్యమైంది. విద్యుత్ సర్‌ప్లస్ రాష్ట్రమని చెప్పుకుంటున్న ఆంధ్రాలో ఇప్పటికీ విద్యుత్ కోతలు ఉన్నట్టు అనంతపురం, విశాఖపట్నం జిల్లాల మిత్రులు ఇటీవల కలిసినప్పుడు చెప్పారు.

కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. మన రాష్ట్రం మనదైంది కాబట్టి మన కష్టం మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము. ఇంతమాత్రానే తెలంగాణ కష్టాలన్నీ తొలగిపోయాయని చెప్పడం లేదు. సంక్షేమ పింఛన్లపై సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఖర్చు చేసిన దానికంటే నాలుగు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వం పెండింగులో పెట్టిపోయిన ఫీజుల బకాయిలనూ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించింది. అడిగిన వారికి అడగని వారికి అందరికీ అన్నీ ఇస్తున్నారు. చెప్పినవి, చెప్పనివీ అన్నీ ముఖ్యమంత్రి చేసుకుంటూ పోతున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్న మాట వాస్తవమే. అయినా అరవయ్యేళ్లుగా జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి సమయం పడుతుంది.

ఆలోచనలు, ప్రణాళికలు, ప్రాజెక్టులు పట్టాలపైకి రావడానికి సమయం పడుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులపై రీడిజైనింగ్ అంటే అదేదో అర్థం కానట్టు కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పోలవరం వద్ద చేసింది రీడిజైనింగ్‌లో భాగమే. తక్షణం నీటిని తీసుకోవడానికి వీలుగా ఆయన పట్టిసీమ పథకాన్ని చేపట్టారు. పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆచరణాత్మకంగా ఆలోచించి ఆయన ఆ నిర్ణయం చేసి ఉంటారు. రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం కూడా రీడిజైనింగులో భాగమే. తక్కువ వ్యవధిలో ఎక్కువ నీటిని తీసుకోవడం కోసం 11000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పోతిరెడ్డిపాడు కాలువను వెడల్పు, లోతుతో 55000 క్యూసెక్కులకు పెంచారు. అంతకు ముందు పెన్నానదిపై నిర్మించుకున్న రిజర్వాయర్లన్నింటినీ శ్రీశైలం జలాలతో నింపుకునే విధంగా ప్రాజెక్టులు, పనులు పూర్తి చేశారు. వీటన్నింటికీ దగ్గరుండి దరువేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆచరణయోగ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల రీడిజైనింగుకు పూనుకుంటున్నారు. అందుకు పదవీ విరమణ చేసిన నీటిపారుదల ఇంజనీర్ల సహకారం తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ప్రాణహిత- చేవెళ్ల కాంట్రాక్టర్ల కోసం, రాజశేఖర్‌రెడ్డి ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రజలను మోసం చేయడంకోసం రూపొందించిన ప్రాజెక్టు. ప్రాణహిత నుంచి చేవెళ్ల దాకా నీరు రావడానికి ముందు మధ్యలో చాలా మతలబు ఉంది. శ్రీరాంసాగర్‌లో నీటిలభ్యత దెబ్బతిని చాలా కాలమైంది. శ్రీరాంసాగర్ మొదటి దశ కాలువలకే నీరు సరిగా అందని పరిస్థితి. వరంగల్ జిల్లా కొడకండ్ల ప్రాంతం నుంచి సూర్యాపేట దాకా, అటు మహబూబాబాద్ దాకా రెండో దశ కాలువలు తవ్వి కూడా పదేళ్లు దాటింది.

కానీ ఆ కాలువల్లో ఒకటి రెండు సార్లకు మినహా నీరు రాలేదు. గోదావరి నదిలో శ్రీరాంసాగర్ ఎగువ నుంచి సమృద్ధిగా జలాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 64 ప్రాజెక్టులు కానీ, బరాజ్‌లు కానీ నిర్మించి నీటిని నిలుపుకుంటున్నది. అంటే గోదావరిలో మనకు నీరు లభించేది ప్రాణహిత కలిసే చోటు నుంచి కిందికే. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన ఎంత చెండాలంగా జరిగిందంటే శ్రీరాంసాగర్ కాలువ, వరద కాలువలను దాటుకుని చేవెళ్లకు తీసుకువస్తామని చెప్పేంత. శ్రీరాంసాగర్‌కు ముందే ఆయకట్టును నిర్ధారించారు. వరద కాలువ కింద కూడా ఆయకట్టును నిర్ణయించి, కాలువలు తవ్వారు. కొన్ని చోట్ల రిజర్వాయర్లు నిర్మించారు. కానీ ఈ ఆయకట్టుకు, ఈ రిజర్వాయర్లకే నీరు అందించే ప్రయత్నాలు జరుగలేదు. ఈ రెండు కాలువలను పారించకుండా, ఆ కాలువల మీదుగా చేవెళ్ల దాకా నీరు తెస్తారని కాంగ్రెస్ నాయకులు ఎలా భావించారో అర్థం కాదు.

ఇదంతా తెలంగాణ సమస్యతో రాజశేఖర్‌రెడ్డి ఆడిన మాయాజూదంలో భాగంగా జరిగింది. ఇప్పటికీ ఆ మాయా జూదాన్ని అర్థం చేసుకోలేక కాంగ్రెస్ నాయకత్వం ఏదేదో మాట్లాడుతున్నది. చేవెళ్లకు నీరు తీసుకురావాలి. మూసీ, ఈసీ నదులను పునరుజ్జీవింప జేయాలి. కృష్ణా నదీ జలాలను ఇదే నదీ పరివాహక ప్రాంతాలైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మళ్లించాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులకోసం కొట్లాడినా, మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులపై రాజకీయ కయ్యాలు రాజేయాలని చూడడమే వైపరీత్యం.

మరో విపరీతవాదం ఏమంటే… ఇన్నేండ్ల కష్టాలన్నీ ఒక్కేడుతో తీరిపోలేదే అని లాజిక్కులు తీయడం. తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని అడ్డగోలుగా మాట్లాడడం. కొందరు నాయకులయితే బచావో ఉద్యమాలే మొదలుపెట్టారు. తెలంగాణ కోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా ఇప్పుడు కొత్త జెండాలు ఎజెండాలు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తామని చెబుతుంటే విస్మయం కలుగుతున్నది. ఇప్పటికీ మేము తెలంగాణపక్షం అని చెప్పుకోలేని రాజకీయ పరాన్నజీవులు పొద్దున లేస్తే తెలంగాణపై మొసలికన్నీరు కారుస్తున్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఆధిపత్యశక్తులకు పాదపూజ చేస్తూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సుభాషితాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జయాపజయాలను అంచనా వేయడానికి చాలా సమయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పనితీరును అంచనావేయడానికి ముందుగా తెలంగాణ ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. తెలంగాణ సమస్యలపై తమ నిజాయితీని ప్రకటించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై విచక్షణతో కూడిన విమర్శలు చేయాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే వేళాపాళా లేకుండా టాగూర్ వర్ధంతి సభ నిర్వహించినట్టే ఉంటుంది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *