హైదరాబాద్ ను త్వరలోనే డిజిటల్ నగరంగా మారుస్తామని, నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ నగరాలను అధ్యయనం చేస్తున్నామని, తద్వారా హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
నగరాల అభివృద్ధిలో టెక్నాలజీని విరివిగా వాడుకోవాలని, పౌరులకు నాణ్యమైన సేవలు అందించేవే స్మార్ట్ సిటీలని, సమగ్ర సర్వేతో సేకరించిన సమాచారంతో పౌరులకు మరిన్ని నాణ్యమైన సేవలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పన్నులు, ఆదాయం విషయంలో పారదర్శకంగా ఉంటామని కేటీఆర్ వివరించారు.