పీపీఏలు రద్దు చేస్తూ ఆంధ్రా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు అన్న చంద్రబాబునాయుడు పీపీఏలు రద్దు చేసి ఒక కన్ను అయిన తెలంగాణను పొడిస్తే ఎలా? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం, అనైతికం, తొందరపాటు చర్య అని మండిపడ్డారు.
కేంద్రం చేసిన చట్టాలను చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కరెంట్ నిత్యావసరం కాబట్టి ఎన్టీపీసీలో ఉత్పత్తి అయ్యే మొత్తాన్ని కేటాయించాలని, మరింతగా బొగ్గు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడానని, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారని దత్తాత్రేయ పేర్కొన్నారు.