mt_logo

దళితుల పేదరికం పోగొట్టేందుకు కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం దళిత బంధు: మంత్రి కొప్పుల

దళితుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్దతతో పనిచేస్తుందని దీనికి చక్కని ఉదాహరణ దళిత బంధు పథకం అని, నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి దళిత బందులో ఎంపికైన లబ్ధిదారులకు నాలుగు యూనిట్లు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దళిత బంధును కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ నెల 16 న ప్రారంభించి ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయం అని అన్నారు. దళిత బంధు పథకానికి ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందని అన్నారు. మొదటి విడుతగా దళిత బంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సి.ఎం. అందించారని, నాలుగు యూనిట్ల క్రింద నేడు లబ్ధిదారులకు 2 ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేశామని మంత్రి తెలిపారు. దళిత బంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్షపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి దళిత బంధు అమలు చేస్తుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కన్న కళలను ముఖ్యమంత్రి కెసిఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. నిన్నటి వరకు డ్రైవర్ ఉన్న అతను నేడు వాహన యజమానిగా, గతంలో గుమస్తా నేడు ట్రాలీ యజమానిగా మారడం దళిత బంధు గొప్పతనం అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏండ్లు గడుస్తున్న దళితుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితుల కోసం దళిత బంధు ప్రకటించడం అభినందనీయం అని అన్నారు. అంచెల వారీగా దళితులందరికి దళిత బంధు పథకం అమలు అవుతుందని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పథకం కింద దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుక పల్లి కొమరమ్మ – కనకయ్య దంపతులకు ట్రాక్టర్, జి సుగుణ – మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్ కు మారుతి కారు ను మంత్రులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ , రవాణా శాఖ ఉప కమీషనర్ ఎం. చంద్ర శేఖర్ గౌడ్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ సురేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *