mt_logo

సీఎం అంటే కట్టింగ్ మాస్టరా.. పథకాల్లో లబ్ధిదారుల సంఖ్య కోత పెట్టడంపై కేటీఆర్ ధ్వజం


సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొక్కసారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గారు.. సీఎం అంటే కటింగ్ మాస్టరా.. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా.. సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా అని ప్రశ్నించారు.

నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడ రూ. 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదలు రూ. 39 వేల కోట్లు అని ఇప్పుడు రూ. 31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు అని విమర్శించారు.

పాసుబుక్కులు లేవనే నెపంతో.. లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం. రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం అని హెచ్చరించారు.

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం అని కేటీఆర్ తెలిపారు.

మొన్న.. లక్షలాది మందిని రూ. 500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న.. 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు.. రూ. 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి.. లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు అని అన్నారు.

నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ. 7,500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు.. అధికారంలోకి రాగానే కొందరికే కొన్ని అని కోతపెడుతున్నారు అని దుయ్యబట్టారు.

రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.