రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు రైతుల కోసం దేశంలోనే ఎక్కాడా లేనివిధంగా 2018 సం.లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు తెలంగాణ సర్కార్ రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఆర్ధికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

5 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్ధికసాయం చేయనున్నట్లు, ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2 వేల చొప్పున మూడు వాయిదాలలో ఈ నగదు బదిలీ కానుందని పీయూష్ వెల్లడించారు. పేదలైన 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మూడు విడతల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. డిసెంబర్ 1, 2018 నుండి ఈ పథకం అమలు కానుంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రూ. 75 వేల కోట్లు, 2018-19 సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయిచారు.
