mt_logo

జూన్ 1 నుండి 3 వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బీఆర్ఎస్ అధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి.

జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు.

జూన్ రెండవ తేదీన.. తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడుస్తున్న నేపధ్యంలో.. దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఇదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మరియు జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానాల్లో అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు.

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.

ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు నేతలను కోరారు