mt_logo

తెలంగాణ సమస్యలు ఢిల్లీ వేదికగా పరిష్కరించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి: హారీష్ రావు

ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఆయా జిల్లాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నిర్వహించారు.

పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలి. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు ఢిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు, పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలి అని పేర్కొన్నారు.

రాజీ పడకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్ఎస్‌తోనే సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ మోసాలపై నిలదీయాలి.. ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి.. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని అన్నారు.

రెండు మూడు హామీలు అసంపూర్తిగా అమలు చేసి అన్ని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నది. రుణమాఫీ చెల్లించకుండా చోద్యం చూస్తున్నది, కరెంట్ రాకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. పొలాలకు నీరు అందక ట్యాంకర్లతో నీళ్ళు అందించే కాలం వచ్చింది..కాలిపోయే మోటార్లు, పెలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ల దుస్థితిని కాంగ్రెస్ మళ్ళీ తెచ్చింది అని విమర్శించారు.

అర్హులు అంటూ గ్యాస్ సబ్సిడీ 30% శాతం మందికే ఇస్తూ, మిగతా 70% వారికి మొండి చేయి చూపుతున్నారు. ఇలాంటి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు ఇంటింటికి వెళ్లి చెప్పాలి.. మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది. హామీలు అమలు చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్‌ను నిలదీయాలి అని హరీష్ రావు తెలిపారు.

వానాకాలం వడ్లు బోనస్ ఇచ్చి కొనలేదు. వచ్చే యాసంగి పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని నిలదీయాలి.. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే అనునిత్యం నిలదీసే బీఆర్ఎస్‌తోనే అది సాధ్యం అవుతుంది. వాస్తవాలను ఎప్పటికపుడు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలి అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయి.. పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి..మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా కృషి చేయాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.