
గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న మాతా శిశు మరణాల పైన భారత రాష్ట్ర సమితి తరఫున ఒక నిజ నిర్ధారణ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని) ఏర్పాటు చేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ తరపున ఏర్పాటు చేయనున్న ఈ నిపుణుల కమిటీ గాంధీలో జరుగుతున్న మరణాలపైన అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను ప్రభుత్వంతోపాటు ప్రజలతోనూ పంచుకుంటామన్నారు.
పార్టీ తరపున చేసే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం కలిసి రావాలని ప్రజల ఆరోగ్యాలను బాగుపరిచేందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు సూచనలను స్వీకరించాలని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలపైన దృష్టి సారించాల్సింది పోయి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన బిఆర్ఎస్ పైన ఎదురుదాడికి దిగడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాల్సింది పోయి సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమానికి తెరలేపిందని కేటీఆర్ విమర్శించారు.
ఇప్పటికైనా మరణాలపై రివ్యూ చేశారా? నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోకస్ చేశారా.. లేదా? మొన్నటి బదిలీల్లో సీనియర్ డాక్టర్లను బదిలీపై పంపారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందా.. లేదా? అనే ప్రశ్నలకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన డాక్టర్లను బదిలీ చేయడం వలన అక్కడ చికిత్సలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందని విషయాన్ని గుర్తించాలని దీని అరికట్టి మరణాలను తగ్గించే ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు.
వైద్యం అందటం లేదు.. పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహప్రభో అంటే బురదజల్లుతున్నారని మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే.. హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుపత్రులు, వరంగల్లో నిర్మాణం నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసే వాళ్లమా? కేసీఆర్ కిట్లు, తల్లి-బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టేలా వాహనాలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవటం, రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట 33 మెడికల్ కాలేజీల ఏర్పాట్లు జరిగేవా? అని కెటిఅర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మాపై ఎదురుదాడి తర్వాత, ముందుగా మీ పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలని కెటిఅర్ సూచించారు. పోయిన ప్రాణాలు తిరిగి రావు.. ఆ తల్లుల కడుపుకోత తీర్చలేమనే సోయితో అలోచించి, ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే మీ పాలన తీరు కూడా మారుతుందని హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలు ఒక సంఖ్యగా మాత్రమే కనిపించడం దారుణమని అది ఒక కుటుంబానికి సంబంధించిన శిశువు లేదా తల్లి మరణం అనే మానవీయమైన కోణంలో ఆలోచించాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న మరణాలు ఒక కుటుంబ భవిష్యత్తు అనే కనీస సొయి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.