mt_logo

తెలంగాణ బిల్లు అడ్డుకోవడానికే బాబు ఢిల్లీ యాత్ర-హరీష్ రావు

తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్ రావు పాల్గొన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబుది మూడుకళ్ల సిద్ధాంతమని, వెన్నుపోటు రాజకీయాలు నడపడంలో ఆయన సిద్ధహస్తుడని మండిపడ్డారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ కావాలని అంటున్నారని, చంద్రబాబు మాత్రం స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికే ఢిల్లీ పయనమయ్యారని, ఆయన మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోవడం చూసి నేషనల్ మీడియా జుట్టు పీక్కుంటుందని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే ఒంటరిగా చంద్రబాబు జాతీయనాయకులను కలిసి బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులుపెట్టుకొన్న పార్టీలతో పాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదేనని, తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కోరారు. ముఖ్యమంత్రి పదవి ముసుగులో కిరణ్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుకు రావాలని, ఆయనకు పోటీగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *