mt_logo

అస్తిత్వ పోరాటాలదే అంతిమ విజయం

– టి.మోహన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది

‘తెలంగాణ ఉద్యమానికి చారిత్రక నేపథ్యంతోపాటు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలున్నాయి. సాధారణ ప్రజల్లో సైతం బలమైన ఆకాంక్ష కనిపిస్తున్నా ఈ ప్రాంత ప్రజావూపతినిధులెందుకు వ్యతిరేక దిశలో వ్యవహరిస్తున్నారు’? అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ పెద్దమనిషి మలిదశ ఉద్యమానికి ముందునన్నడిగారు. ప్రభుత్వోద్యోగిగా చాలా కాలం ఢిల్లీలో పనిచేసి పదిహేనేళ్లుగా హైదరాబాద్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్న ఆ సీనియర్ సిటిజన్ మొహమాటం లేకుండా మరో ముఖ్యమైన మాట అన్నారు. ‘అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనవాళ్లు తమిళ సోదరుల నుంచి పొందిన అవమానాలు, వివక్షలన్నీ, ఇక్కడి వారిపై ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నట్లుగా ఉన్నది. అసలు విషయాలు, చారిత్రక సత్యాలను మీ లాంటి న్యాయవాదులు సామాన్య ప్రజలందరికి తెలియచేయాల’ని ఆయన చేసిన కర్తవ్యబోధ నన్ను ఆలోచింపచేసింది.

విశాలాంధ్రలో తెలంగాణకు ప్రత్యేకమైన కష్టాలు షురువైన రోజులవి. అప్పుడప్పుడే రాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి తరలిరావడంతో హైదరాబాద్‌లో హఠాత్తుగా పెరిగిపోయిన జనాభా వల్ల వనరులు, వసతుల కొరతతోపాటు స్కూలు, కాలేజీ సీట్లకు అనూహ్యమైన స్థాయిలో పోటీ ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతం మొత్తానికి అప్పట్లో ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది. పెరుగుతున్న ప్రాంతీయ విద్యా అవసరాలకు అది సరిపోయేదికాదు. సీమాంధ్ర నాన్-ముల్కీల చొరబాటుతో సమస్య మరింత జటిలమైంది. అధికారం తెలంగాణేతర శక్తుల్లో ఉండేది.‘బడితే ఎవడిదో బర్రె వాడిదే’అన్నట్లు పరిస్థితులుండేవి. రాష్ట్రావతరణకు ముందు రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలన్నింటిని కాలరాస్తున్న కాలమది. ఆగమేఘాల మీద మలక్‌పేట, పంజాగుట్ట లాంటి ప్రాంతాలలో కర్నూలు క్యాంపు రాజధాని నుంచి తరలి వచ్చిన ప్రభుత్వోద్యోగుల కోసం భారీఎత్తున వసతి గృహాలు నిర్మించబడ్డాయి. అంతటా నిరుద్యోగ సమస్య. అప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, డీఆర్‌డీఎల్ లాంటి అనేక సంస్థలు హైదరాబాద్ చుట్టూ వెలిసినా తగిన సహకారం లేనందున తెలంగాణ నిరుద్యోగులకు నిరాశేమిగిలేది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కోటాలో ఇష్టారాజ్యం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యోగాల్లో తెలంగాణ వారి వాటా, హక్కుల గురించి ఆడిగేనాథుడు లేడు. జవాబు దొరికే మార్గం కూడా కనిపించేది కాదు. రాజకీయాల్లో ఉండేవారికి పదవులు, పైరవీలయితే, ఉద్యోగస్థులకు సాధారణంగా వారి ప్రమోషన్, జీతభత్యాలు పెంపుదలకోసం పోరాటాలతో సరిపోయేది. సగటు పౌరుని స్థితిగతుల గురించి, వంచించబడుతున్న తెలంగాణ ప్రాంతీయుల కష్టాలు ఎవరికీ పట్టని పరిస్థితి ఉండేది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో అప్పుడప్పుడే తెరమీదికోస్తున్న నక్సలైట్ ఉద్యమం, అందులో కలుస్తున్న విద్యాధికుల గురించి వార్తలు వినిపిస్తుండేవి. మరోవైపు వివక్ష పాలనవల్ల పెరిగిన రాజకీయ కక్షల వల్ల పరిస్థితి విషమించి 1969లో తొలి తెలంగాణ ఉద్యమం ఉధృత రూపంలో రానే వచ్చింది. ఈ ఉద్యమం ప్రపంచదేశాలను సైతం ఆకర్షించి సత్ఫలితాలు పొందే దశలో స్వార్థ రాజకీయాలు రంగప్రవేశంచేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాయి. ఆ తర్వాత అన్యాయాలు, వివక్ష పెరిగిందే గాని ఒరిగిందేమిలేదు.

స్వరాష్ట్రంలో ఆదరణ కరువైన నిరుద్యోగులలో ఆ రోజుల్లో డిగ్రీ, డిప్లమోలు చేతపట్టుకుని మహారాష్ట్ర, కర్ణాటకలో స్థిరపడిన వారెందరో ఉన్నారు. ఒక్కరు కూడా సీమాంధ్ర వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. ఇరు ప్రాంతాల మధ్య ఆదేదో అర్థం కానీ దాయాదుల మధ్య ఉండే వైరం లాంటిది ఉందని చరిత్ర పాఠాలు చెప్తున్నాయి. విశాలాంధ్ర మంత్రం ఒక విఫలమైన ప్రయోగం. అస్తిత్వ పోరాటాలు కులం, మతం వర్గాలకు అతీతమైనవి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇరు ప్రాంతాలు కలిసి ఉండడమనేది ‘కల’ మాత్రమే కాదు ‘కల్ల’. విశాలాంధ్ర అనేది ఆరిపోతున్న దీపం లాంటిది. ఆరిపోయే ముందు వెలిగే వెలుగులా, ఇరువైపుల ఉన్న స్వార్థశక్తులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు, విష ప్రచారాలకు పూనుకున్నా ఆలస్యమవుతుందేమో గానీ అస్తిత్వ పోరాటానిదే అంతిమ విజయం.

‘ఎంత చైతన్యం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత కాలం సీమాంధ్ర ధనిక వర్గాలు తెలంగాణ ప్రాంతపు బలహీనవర్గాలను అణచివేస్తూనే ఉంటాయి. ఏ వర్గాన్నీ ఎదగనీయవు. ఐక్యంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించడమే పరిష్కారం’ అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటల్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. రాష్ట్ర సాధన పోరాటంలో అందరం కలిసి ఉద్యమిద్దాం. మన కల సాకారం చేసుకుందాం. మన నేలలో మన పాలనను స్థాపించుకుందాం. ప్రాంతేతర దోపిడీదారులను పొలిమేర దాకా తన్ని తరుముదాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతాళంలో పాతరేద్దాం.

– నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *