ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. షేక్ పేట మండలంలోని బంజారాహిల్స్ సర్వే నంబర్ 403/పార్ట్ లో కేటాయించిన 16 ఎకరాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనంద్ సినీ సర్వీసెస్ కు ఐదెకరాల భూమి, ఏపీ హౌసింగ్ బోర్డుకు 10 ఎకరాలు, ఏపీఎఫ్డీసీకి మరో 20 ఎకరాలు కేటాయించారు.
అయితే ఏపీఎఫ్డీసీకి కేటాయించిన 20 ఎకరాల భూమిని సరిగ్గా పట్టించుకోనందున నాలుగు ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు హైదరాబాద్ కలెక్టర్ గుర్తించారు. భూమి పరిరక్షణకు ఏపీఎఫ్డీసీ ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలు జరిగే అవకాశం ఉన్నందున మిగిలిన 16 ఎకరాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. నివేదిక ఆధారంగా రాష్ట్రప్రభుత్వం ఆ భూమిని వెనక్కు తీసుకుంటూ జీవో జారీ చేసింది.