mt_logo

ఉపాధి హామీలో మన రాష్ట్రమే నెంబర్ వన్

  • పనులు ఎలా జరుగుతున్నాయి?
  • ఉపాధి పనుల పరిశీలన
  • మండుటెండల్లో పని చేయవద్దని సూచన
  • కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రామన్న గూడెం (కొడకండ్ల) : ఉపాధి హామీ పనులు ఎలా జరుగుతున్నాయి? ఎండాకాలంలో పనులు సజావుగా సాగుతున్నాయా? ఎండలు మండిపోతున్న వేళ పనులు చేస్తున్నారా? అంటూ ఉపాధి హామీ కూలీలను పరామర్శించి, పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎండలు మండుతున్న ఈ కాలంలో  ఉదయం, సాయంత్రాలు పని చేయాలని, మధ్యాహ్నం పూట పని చేయవద్దని కూలీలకు సూచించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వెళుతూ మంత్రి అక్కడ కొద్ది సేపు ఆగారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామన్న గూడెం వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు పాదులు తవ్వుతూ, పిచ్చి మొక్కలను తొలగిస్తున్న ఉపాధి హామీ కూలీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముచ్చటించారు. 

కూలీలకు పనులు కల్పిస్తూ ఉపాధి అందేలాగా చూడటమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. అయితే మండుటెండల్లో పని చేయవద్దని, అనారోగ్యానికి గురి కావద్దని, ఉదయం సాయంత్రాల్లో మాత్రమే పని చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. కూలీలకు అన్ని సదుపాయాలు సజావుగా అందించాలని మంత్రి సంబంధిత ఉద్యోగులను అదేశించారు. ఉపాధి హామీ లో మన రాష్ట్రమే నెంబర్ వన్ గా ఉందని చెప్పారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి వచ్చి తమ బాగోగులు అడగడంతో కూలీలు అత్యంత సంతోషం వ్యక్తం చేశారు.