mt_logo

మరో తిరుమలగా కరీంనగర్

  • మరో తిరుమలగా కరీంనగర్
  • టీటీడీ శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సర్వం సిద్దం
  • ఈనెల 22న భూకర్షణ, 31న భూమిపూజ, సంవత్సరన్నరలో పూర్తి
  • కృషి చేసిన సీఎం కేసీఆర్ గారికి, టీటీడీకి ధన్యవాదాలు – మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణను ప్రతీకగా నిలిపారు సీఎం కేసీఆర్ అని, కరీంనగర్ పట్టణంలో కళియుగ ప్రత్యక్ష ధైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్ లో 10 ఎకరాల్లో 20 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించే ఆలయ ప్రాంతంలో పర్యటించి రేపటి పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక ఆలయాన్ని మాత్రమే టీటీడీ సాధారణంగా నిర్మిస్తుందని మన రాజదాని జూబ్లీహిల్స్ లో ఇప్పటికే టీటీడీ ఆలయాన్ని నిర్మించిందని, ఐతే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కరీంనగర్లో సైతం శ్రీవారి ఆలయం కావాలని తనతో పాటు మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, తెలంగాణ టీటీడీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ భాస్కర్ రావు ల కోరిక మేరకు సీఎం కేసీఆర్ గారు టీటీడీకి లేఖ రాసారని, దానికి స్పందిస్తూ టీటీడీ బోర్డులో ఆలయ నిర్మాణానికి అనుమతులిస్తూ స్థలం కేటాయించాల్సిందిగా కోరిన వెంటనే కరీంనగర్లో 10 ఎకరాలను కేటాయించారన్నారు మంత్రి గంగుల.

 కరీంనగర్ శ్రీవారి ఆలయానికి 30 నుండి 40 కోట్లు ఖర్చు ఔతుందని ప్రాథమిక అంచనాలున్నాయని, ఇందులో టీటీడీ ఖర్చు 20 కోట్లు పోను మిగతా నిధుల్ని భక్తుల సహకారంతో సమకూరుస్తామన్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు అనుమతించిన నేపథ్యంలో ఈనెల 31న భూమిపూజ ప్రారంభించుకొని సంవత్సరంన్నరలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు మంత్రి గంగుల. ఈ మేరకు శుక్రవారం రోజున తిరుమలలో టీటీడీ అధికారులతో పాటు ఛైర్మన్లతో సమావేశమయ్యామన్నారు. సంపూర్ణంగా తిరుమల మాధిరిగా పూజలతో సహా ఉండే ఆలయంలో రాతి కట్టడంతో గర్భగుడి ముప్పావు ఎకరంలో నిర్మితమవుతుందని, దానికి తూర్పున భావి, ఎడమ పక్కన కోనేరు, మండపాలు, ప్రాకారాలు తదితర నిర్మాణాలు చేపడతామని, స్వామి వారితో పాటు భూదేవీ, శ్రీదేవీ సమేత ఆలయాన్ని నిర్మిస్తామన్నారు మంత్రి. ఈ నిర్మాణానికి టీటీడీ నోడల్ అధికారిని నియమించారన్నారు.

వైఖానస ఆగమ శాస్త్ర పధ్దతుల ప్రకారం కరీంనగర్ టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ఇది తిరుమలలో జరిగే కైంకర్యాల ప్రకారం ఉంటుందన్నారు. ఈనెల 22న తిరుమల ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల చేతుల మీదుగా మూలవిరాట్టు ఉండే ప్రాంతంలో భూకర్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 31న ఉదయం 7.20 గంటలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరుల సమక్షంలో భూమిపూజ నిర్వహిస్తామని, అదే రోజున సాయంత్రం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తామన్నారు, ఈవేడుకలకు ప్రత్యేకంగా మూడు గజరాజులు తరలివస్తున్నాయని, ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.