mt_logo

ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తాం: మంత్రి కేటీఆర్

ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆఆర్‌ను నేడు కలిశారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని కేటీఆర్ వారికి తెలిపి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌తో తమ ఆవేదన పంచుకున్నారు.

ప్రవళిక మరణానికి శివరాం అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు మంత్రిని కోరారు. మా కూతురు మృతికి కారణమైన శివరాంకి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా ఇచ్చిన మంత్రి కేటీఆర్, ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమన్నారు. కుటుంబ సభ్యులు ఈ బాధాకర సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలు డీజీపీతో మాట్లాడిన కేటీఆర్, విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు. 

ప్రవళిక మృతికి కారణమైన  వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రవళిక  కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని,  ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక  కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన భరోసాకి ప్రవళిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.