mt_logo

దీక్షా దివస్: తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు

నవంబర్ 29, తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించిన కేసీఆర్.. ఆమరణ దీక్షకు పూనుకుని  ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటించడానికి కారణమైన రోజు. ఉద్యమం చేసినా.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. చావునోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవడంలో సఫలీకృతులయ్యారు. 

ఖమ్మంలో ఆరోగ్యం క్షీణించిన కేసీఆర్‌

దీక్షకు  ముందు రోజు నవంబర్ 28, 2007న కరీంనగర్ కు చేరుకున్న చంద్రశేఖర్ రావు..మరుసటి రోజు 29న దీక్షాస్థలి సిద్ధిపేటకు కరీంనగర్ నుంచి జయశంకర్ సార్ తో కలిసి బయలుదేరగా అల్గునూర్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులో తీసుకుని వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు.ఈ సంఘటన తెలంగాణ ను కుదిపేసింది. కేసీఆర్‌ను దీక్షకుపక్రమించకుండా అదుపులోకి తీసుకోవడం తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఖమ్మంలో ఆరోగ్యం క్షీణించిన కేసీఆర్‌ను డిసెంబర్ 3న హైదరాబాద్‌కు తరలించారు. తరలించే క్రమంలో రికార్డైన కేసీఆర్ విజువల్స్‌ను చూసిన తెలంగాణ ప్రజలు తట్టుకోలేక పోయారు. విలవిలలాడారు. మా నాయకుడు అచేతన వ్యవస్థలో ఉన్నాడన్న విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు.

ఉద్యమ సారథి కేసీఆర్ కన్నీళ్లు

ఉమ్మడి పాలకుల వ్యవహారాలన్నీ ఉద్యమ కారులను అవమానించేలా రెచ్చగొట్టేలా ఉండటంతో ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. నిమ్స్ కు తరలించేటప్పుడు ‘‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’’ అని కేసీఆర్ చేసిన నినాదం తెలంగాణ రణనినాదమైంది. దీంతో తెలంగాణ అంతా అల్లకల్లోలమైంది. ప్రజలు భగ్గుమన్నారు. బస్సులు బందు, రైళ్లు బందు అయ్యాయి. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. అరెస్టును తట్టుకోలేక  కాంతాచారి ఎల్బీనగర్‌లో అగ్గికి ఆహుతయ్యాడు. పిల్లల ఆత్మహత్యలు చూసి ఉద్యమ సారథి కేసీఆర్ కన్నీళ్లు కార్చారు. 

దీక్షా దివస్‌తో ఉద్యమ స్ఫూర్తి

కేసీఆర్ పట్టువిడవకుండా కొనసాగిస్తున్న దీక్షతో రగిలిన తెలంగాణ దెబ్బకు కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో ఐదుసార్లు డిసెంబర్ 9న సమావేశమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్యను హైదరాబాద్ విమానం ఎక్కించారు. రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలో చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించడానికి కారణమైంది. అప్పటి నుంచి దీక్షా దివస్‌గా దీన్ని ప్రతి ఏటా తెలంగాణ సమాజం నిర్వహించుకుంటూ స్పూర్తి పొందుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు రేపు అనగా జరుపుకుంటున్న దీక్షా దివస్ ప్రతీ తెలంగాణ బిడ్డలో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ విజయాల పరంపరను కొనసాగించనున్నది.