![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/11/Untitled-Project-88.jpg?resize=1024%2C576&ssl=1)
ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రకటించిన భారత రాష్ట్ర సమితి ఈరోజు మరో కీలకమైన అంశం పైన ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రకటించారు. అధికారంలోకి రాగానే నూతన సంవత్సరం జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని తెలియజేశారు.
ప్రధానంగా గల్ఫ్లో ఉపాధి కోసం వెళ్ళిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరే రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు కూడా బీమా అందిస్తామని తెలిపారు. ఈ గల్ఫ్ బీమా పథకం కింద ఐదు లక్షల బీమా కవరేజ్ ప్రతి ఒక్క వ్యక్తికి అందుతుందని తెలిపారు. దీంతోపాటు గల్ఫ్ పాలసీలో భాగంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా కలిపి సమగ్రమైన పాలసీని అమలులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఈ మేరకు కేటీఆర్ తన సిరిసిల్ల రోడ్ షో లో ప్రకటన చేశారు.