mt_logo

గుంజోయి…విసురోయి… వల విసిరి పట్టోయ్!

గంట్లకుంట (పెద్ద వంగర) జూన్ 8 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగ గ్రామాల్లో ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొంటూ వస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని సోమవారం గుర్తూరు తదితర గ్రామాల్లో జరుగుతున్న చెరువుల పండుగ కార్యక్రమాల్లో గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ, బతుకమ్మలని చెరువుల్లో వదులుతూ, కట్టమైసమ్మల దగ్గర పూజలు నిర్వహిస్తూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విందు, వినోదాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలోకి రాగానే ఈ రోజు మృగశిర కావడంతో కుంట కట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లు మంత్రి కంట పడ్డారు.

వెంటనే చెరువులోకి దిగి వల ను ఒకవైపు మంత్రికి ఇచ్చి మరో వైపు జాలర్లు పట్టుకొని  అంతా కలిసి వల విసిరి చేపలు పట్టారు. చేపలు ఉచితంగా వస్తున్నాయా? చేపలు పెద్దగా అవుతున్నాయా? చేపల ద్వారా వారి ఆదాయ మార్గం ఎలా ఉంది? వంటి వివరాలు మంత్రి తెలుసుకున్నారు. ప్రభుత్వం నీటితో చెరువులను నింపి, ఆ నీటిలో ఉచితంగా చేపలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించడమే కాక, ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి వారికి చెప్పారు. చెరువులు ఒకప్పుడు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయో, తిరిగి వాటిని బాగు చేసి అదే తరహాలో ప్రజలకు ఉపయోగ0లోకి సీఎం కేసీఆర్  తెచ్చారని, ఇవాళ చెరువులు ప్రజలకు ఆదెరువు గా మారాయని మంత్రి తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ గారి దయవల్ల, కృషి వల్ల జరుగుతుందని చెప్పారు. తెలంగాణకు పూర్వవైభవం తెచ్చి అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ కి అండగా ఉండాలని వారిని కోరారు.