mt_logo

సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో చెరువులకు నవజీవం

మిషన్ కాకతీయ పథకం క్రింద రాష్ట్రంలో 47 వేలకుపైగా  చెరువులను పునరుద్ధరణ

15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ

5,350 కోట్ల రూపాయలు వ్యయం 

3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ ల నిర్మాణం

హైదరాబాద్, జూన్ 8 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన  పథకం మిషన్ కాకతీయ. తెలంగాణ భూ భౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. సమైక్య పాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబూల్లా ఉన్న చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకుపైగా  చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలను పటిష్టపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, పూడిక తొలగించిన ఫలితంగా నేడు రాష్ట్రంలోని  చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిపోయింది. 

చెరువుల పునరుద్ధరణ

5,350 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతో పాటు, విరివిగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది  ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. దాదాపు 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం 3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది.  మిగతా చెక్ డ్యాముల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించబడిన చెరువులకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నుండి కాలువల ద్వారా నీటిని తరలించి ఎండాకాలంలో సైతం పూర్తి స్థాయి నీటి నిల్వతో చెరువులు నిండుగోలాలుగా తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేడు దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉబికిఉబికిపైకి వస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండడం తో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.