mt_logo

ఎక్కడైతే అవమానించబడ్డమో అక్కడే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం:మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు… హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను మంగళవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు. అధికారులు, వర్క్ ఏజెన్సీ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులకు,వర్క్ ఏజన్సీకి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  మాట్లాడుతూ..  

తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకం నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించి ఈ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణం అరుదైన స్టెయిన్ స్టీల్ తో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడం. కేసీఆర్ గారి నేతృత్వంలో ఎక్కడైతే ప్రత్యేక తెలంగాణ కోసం జలదృశ్యం మీటింగ్ జరిగిందో అదే స్థలంలో నేడు కేసీఆర్ గారి నేతృత్వంలోనే అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నాం. జలదృశ్యం, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును జీర్ణించుకోలేక అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా కార్యాలయంలో సామాన్లు,ఫర్నీచర్ బయట పడేశారు. ఎక్కడైతే అవమానించబడ్డమో ఇప్పుడు అదే ప్రాంతంలో కేసీఆర్ గారు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారు. రాష్ట్రానికి అతిథులు,ప్రముఖులు ఎవరు వచ్చిన ఈ స్మారకాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ నిర్మాణం ప్రారంభం ఉంటుంది. అని మంత్రి అన్నారు.