mt_logo

ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్‌ను పరిశీలించి కితాబిచ్చిన అఖిల భారత రైతు సంఘాల నాయకులు

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంప్ హౌజ్‌ను  మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల 300 కి. మీ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కించి ఎస్సారెస్పీ లో నింపే ప్రక్రియను రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు వారికి వివరించారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని రైతులకు సాగు నీటి కష్టాలు ఈ పథకం ద్వారా తొలగిపోయాయన్నారు. మండుటెండల్లో కూడా కాలువలు, చెరువులు నిండు కుండలా ఉంటున్నాయని వారికి వివరించారు.
300 కి.మీ కింద నుంచి కాళేశ్వర జలాలు ఎస్సారెస్పీకి ఎదురెక్కించడం పట్ల వివిధ రాష్ట్రాల రైతు నేతలు ఆశ్చర్యపోయారు. అద్భుతమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని వారన్నారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా యావత్ దేశానికి ఆదర్శనీయ, రైతు పక్షపాతి పథకాలు ప్రవేశ పెట్టారని వారు అభిప్రాయపడ్డారు.
ముప్కాల్ పంప్‌ను సందర్శించిన వారిలో రఘునాథ్ దాదా పాటిల్ – మహరాష్ట్ర – శేత్కారి సంఘటన్,రాఘవేంద్ర కుమార్ – ఉత్తర ప్రదేశ్ -క్రిషి భూమి బాచఓ మోర్చ, సేవాసింగ్ ఆర్యా – హర్యానా – బికేయు, కే.ఎం. రామ గౌందర్ – తమిళనాడు – తమిళ్ వ్యవసాయ సంఘం. పరశురాం లక్ష్మణ్ – కర్నాటక – ఫర్మార్స్ అసోసియేషన్స్ ఆఫ్ కర్ణాటక,  కోటపాటి నర్సింహం నాయుడు – తెలంగాణ – సౌత్ ఇండియన్ ఫార్మాస్ ఫెడరేషన్ అధ్యక్షులు డా.మంగి రామ్ – హర్యానా,  కే.నాగరాజు – కర్నాటక,అన్నుమాంతరాసు – తమిళనాడు,బాల సాహెబ్ వాడ్కే – మహారాష్ట్ర తదితరులు ఉన్నారు.  బుధవారం నాడు వేల్పూర్‌లో జరిగే అఖిల భారత రైతు సంఘాల సమావేశంలో వీరంతా పాల్గొననున్నారు.