mt_logo

కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత అరిగోస పుచ్చుకుంటుంది: బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది.. కాంగ్రెస్ నిరుద్యోగ యువత అరిగోస పుచ్చుకుంటున్నది అని అన్నారు.

మార్పు కోసం కాంగ్రెస్‌కు నిరుద్యోగ యువత అవకాశం ఇచ్చింది. మార్పు కోసం ఓటేసిన పాపానికి నిరుద్యోగ యువతను కాంగ్రెస్ వేధిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో అన్ని వర్గాలు రోడ్డు ఎక్కుతున్నాయి అని దుయ్యబట్టారు.

ఎన్నికల కోడ్ పేరిట అన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు కోడ్ పోయింది.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చడం లేదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.. ఏమైంది అని అడిగారు.

గ్రూప్ 2 లో 783 పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. 2 వేల పోస్టులు ఇవ్వాలి. గ్రూప్ 3 లో మరో మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చేతకాదు.. ఆయన పీఆర్ స్టంట్లలో బిజీగా ఉన్నారు అని రాకేష్ రెడ్డి విమర్శించారు.

మెగా డీఎస్సీలో 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. జీవో 46పై ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ ఏం చెప్పింది.. ఇప్పుడేం చేస్తోంది. జీవో 46 పై సీఎస్‌కు నా ఫిర్యాదు ఇవ్వాలని వెళితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను గోడ మీద ఫిర్యాదును అతికించి వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అని తెలిపారు.

కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చినా గవర్నర్ వాళ్ళను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోతే రేవంత్ రెడ్డికి బాధ ఉంటుందా లేదా.. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్ధులు తగిన మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వక పోవడం ఏమిటి. తెలంగాణలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో కట్ ఆఫ్ మార్కు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 46 తెచ్చి ఉండవచ్చు.. మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జీవో 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి? అనేక చట్టాలు మార్చుకుంటున్నపుడు జీవోలు మార్చుకుంటే తప్పు ఏమిటి.. మాది ఉద్యమ పార్టీ ఉడుం పట్టుతో నిరుద్యోగుల తరపున పోరాడతాం అని స్పష్టం చేశారు.