బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 16 సీట్లు వచ్చిన టీడీపీ ఆంధ్రాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంది. కానీ కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 సీట్లు ఇస్తే వాళ్లే మన సింగరేణిని ఖతం చేస్తున్నారు అని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే రక్షణ కవచమని కేసీఆర్ గారు వేల సార్లు చెప్పారు.. దానికి గొప్ప ఉదాహరణే రేపు జరగబోయే బొగ్గు గనుల వేలం. మాకు 16 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ గారు చెబితే 16 సీట్లతో ఏం చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మన బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం వేయబోతున్నారు అని అన్నారు.
గతంలోనే వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని కేసీఆర్ గారు కేంద్రానికి ఉత్తరం రాశారు. కేసీఆర్ గారు ఉత్తరం రాసిన వెంటనే అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా సింగరేణికి కోల్ బ్లాక్ల వేలం ఉండొద్దని కేంద్రానికి లేఖ రాశారు.. కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని ఇప్పుడు కోల్ బ్లాక్ల వేలానికి మద్దతు తెలుపుతున్నారు? కేసుల భయమా? రేవంత్ రెడ్డి గారికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని అడిగారు.
ఒడిశాలో రెండు లిగ్నైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించింది.. గుజరాత్లోనూ రెండు ప్రభుత్వ సంస్థలకు 2015 సంవత్సరంలో ఐదు కోల్ బ్లాక్లను కేటాయించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే.. అప్పుడు కూడా ఎలాంటి వేలం లేకుండా లిగ్నైట్ గనులను కేటాయించారు.. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదు? దీని వెనుక సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉంది అని కేటీఆర్ అనుమానాన్ని వ్యక్తం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారు.. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టీవ్ గని లేకుండా నష్టపోయేలా చేసిందే కేంద్ర ప్రభుత్వం. నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్ ఎలా ప్రైవేటీకరణ చేద్దామనుకున్నారో.. అదే విధంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేద్దామనుకుంటున్నారు అని అన్నారు.
సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకే గనులు కేటాయించకుండా వేలం కార్యక్రమం ముందుకు పెట్టారు.. ఎందుకు వేలం పాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొంటుందో చెప్పాలి? పదేళ్లు మా మెడ మీద కత్తి పెట్టిన మేము ఆక్షన్ జరగనివ్వకుండా అడ్డుకున్నాం అని గుర్తు చేశారు.
సింగరేణి కార్మికుల సత్తా ఏంటో మనం ఉద్యమ సమయంలో చూశాం. అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది .. అలాంటి సింగరేణిని ఖచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎలా ఖతం చేశారో.. సింగరేణిని కూడా అదే విధంగా ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 ఎంపీలను ఇస్తే.. సింగరేణిని నిట్ట నిలువునా ముంచే పని చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్లు ఈ సాహసం చేయలే.. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా చెప్పారు. సింగరేణిని కాపాడేందుకే కేసీఆర్ గారు గతంలో వేలం పాటలో పాల్గొన వద్దని చెప్పారు అని తెలిపారు.
మన రాష్ట్రం నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ రావాలె. కానీ మన కేంద్రమంత్రి గారు ఉన్నది అమ్మే పరిస్థితి తెచ్చారు. లోక్ సభలో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారు.. బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇస్తే.. వాళ్లు ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని ప్రశ్నించారు.
బీజేపీ నిర్ణయానికి సీఎం, డిప్యూటీ సీఎం గారు ఎందుకు వంత పాడుతున్నారు? రేపటి వేలంలో డిప్యూటీ సీఎం గారు ఎందుకు పాల్గొనబోతున్నారో చెప్పాలి. వేలం పాటలో పాల్గొనటమంటేనే దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిని అంగీకరిస్తున్నట్లే.. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదు అని ధ్వజమెత్తారు.
సింగరేణి మెడ మీద కేంద్రం కత్తిపెడితే ఆ కత్తికి సాన పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మేము పోరాటాలు చేసి సింగరేణిని కాపాడుకున్నాం.. ఇప్పుడు కూడా సింగరేణిని మళ్లీ కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే.. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.
మన బొగ్గును మనకు కేటాయించకపోవటం చాలా అన్యాయమైన పని. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి. మళ్లీ మా ప్రభుత్వం వస్తది.. అప్పుడు ఈ నిర్ణయాన్ని సమీక్షించి అడ్డుకుంటాం.. వేలంలో పాల్గొనబోయే ప్రైవేట్ కంపెనీలకు మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అని అన్నారు.
ఇకనైనా బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి..ఇక్కడున్న ఎంపీలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారా? రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి ప్రయోజనాలు పట్టనట్లుగా కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయి. సింగరేణిని ఖతం చేసే కుట్రను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.. దీనిపై భవిష్యత్ కార్యాచరణనను కూడా రెండు, మూడో రోజుల్లో ప్రకటిస్తాం అని కేటీఆర్ తెలిపారు.