mt_logo

పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు.. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది, అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టిందని గుర్తు చేసారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం, ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది? అని ప్రశ్నించారు. 

అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా? అని ప్రశ్నించారు. స్కీమ్ ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే. అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపి నోళ్లు ఖమ్మంలో కల్లబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ అని మండి  పడుతూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.