mt_logo

ఇప్పటిదాకా చూసింది ట్రైలరే.. త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతోంది: మంత్రి కేటీఆర్

ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే… ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతుందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ( నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

తెలంగాణ వచ్చినంక కట్టిన 20వ ఫ్లైఓవర్

తెలంగాణ వచ్చినంక కట్టిన 20వ ఫ్లైఓవర్ ఇదని తెలిపారు. SRDP కార్యక్రమంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. అద్భుతమైన అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులను పూర్తి చేశామని తెలిపారు. 

ఇందిరా పార్కు అభివృద్ధి 

గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ నగరాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నూతన సచివాలయం, అమరవీరుల స్థూపం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. దీంతోపాటు ఇందిరా పార్కును కూడా అభివృద్ధి చేస్తాం అని అన్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి

ఈ బ్రిడ్జి ఏర్పాటుతో ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ దాకా దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది

ఈ ప్రాంతంతో అద్భుతమైన సంబంధాలు ఉన్న కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి అనుబంధాన్ని, ఆయన ఇక్కడి ప్రజలకు… కార్మికులకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరును పెడుతున్నామని తెలిపారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం చేస్తున్నదన్నారు. 

మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కి పోతుంది 

కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుకూలంగా గట్టి పునాది ఈ తొమ్మిది సంవత్సరాలలో పడిందని పేర్కొన్నారు. గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దుస్థితి ఈరోజు లేదు. గత పది సంవత్సరాలలో మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నదన్నారు. ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గులకు, చిల్లర పార్టీల వారి మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కి పోతుందని హెచ్చరించారు. 

60 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతోందన్నారు.