mt_logo

అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా

  • ప్రభుత్వ సంస్థలు మూసేస్తున్న కేంద్రం షుగర్ ఫ్యాకర్టీ తెరిపిస్తదటా !
  • అమిత్ షా ప్రకటన కనీసం నమ్మేలా ఉందా ?
  • తెలంగాణ ప్రజల మధ్య వైరుధ్యాలు, గొడవలు సృష్టించలేరు
  • -కోరుట్ల ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత

కోరుట్ల: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షా గా మార్చుకోవాలని అన్నారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని అమిత్ షా అన్నారని, ఎయిర్ ఇండియా వంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారట అని ఎద్దేవా చేశారు. అమిత్ షా ప్రకటన కనీసం నమ్మేటట్టు ఉందా అని అడిగారు.  బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, కోర్టుల్లో కేసులు వేసి అనేక ఇబ్బందులు పెట్టారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల టౌన్‌లో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కవిత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు బయట వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని, తమది నలుగురితో కూడిన కుటుంబం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని తేల్చిచెప్పారు. తెలంగాణ కుటుంబంలోకి వచ్చి ఆ నాయకులు వైరుధ్యాలు సృష్టించలేరని, గొడవపెట్టలేరని సూచించారు. 

కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ అల్లర్లు జరిగేవని, గత పదేళ్లలో ఎలాంటి అల్లర్లు లేకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా లేదా అరాచకం వైపు ఉందామా ? అన్నది తేల్చుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పింది ఎప్పుడూ చేయలేదని, కాబట్టి ఆ రెండు పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. వాట్సప్‌లో ఆ పార్టీలు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 2.32 వేల ఉద్యోగాలను ప్రకటించామని, 1.6 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని గుర్తు చేశారు. 

కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, మంచి నూనె, ఉల్లిగడ్డ వంటి అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. 2 వేల పెన్షన్ ఇస్తుంటే అందులో రూ. 1200 గ్యాస్ సిలిండర్‌కే పోతున్నాయని, కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించడానికి సీఎం కేసీఆర్ రూ. 400 కే అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఎన్ని సార్లు సీఎం కేసీఆర్ డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదని, దాంతో తామే తగ్గించి పేదలపై భారం తగ్గించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కోరుట్లలో వెయ్యి ప్లాట్లను ఇస్తామని, ఇళ్ల  స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహ లక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. కార్తుకు ఓటేసి సంజయ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.