
ఫార్మా హబ్ గా పేరుగాంచిన తెలంగాణకు ఫార్మా కంపెనీల నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఆరిజెన్ ఫార్మా సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం ఆరిజెన్ ఫార్మా సంస్థ తెలంగాణలో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. వ్యాపార అనుకూలతలు, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోనే ఉండటంతోనే హైదరాబాద్ లో పెట్టుబడులకు ఫార్మా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆరిజెన్ ఫార్మా నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
కాగా, ఈ ఫార్మా సంస్థ జీనోమ్ వ్యాలీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్థాపించే, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసమే 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తద్వారా 300 మందికి పైగా ఉపాధి కల్పించనుంది.