
హైదరాబాద్లోని జలవిహార్లో న్యాయవాదుల ఆత్మీయసమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి కనిపిస్తున్నా కొందరు కావాలనే విమర్శిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో అన్ని రంగాల సంక్షేమానికి కృషి చేశామన్నారు. వివిధ రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని.. నాడు నవ్విన వారే నేడు ఆశ్చర్యపోతున్నారన్నారు.
ఓడిపోతే తెలంగాణ నుండి పరిశ్రమలు కర్ణాటకకు
అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని.. 2014 కి ముందు కరెంట్, సాగునీటి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలన్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని డీ.కే. శివకుమార్ అంటున్నారు. తెలంగాణకు ఫాక్స్ కాన్ కంపెనీ రాకుండా కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని డీకే శివకుమార్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ నుండి పరిశ్రమలు కర్ణాటకకు తరలిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలు
కేసీఆర్ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉంది. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. 24 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చాయి. కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని కేటీఆర్ అన్నారు.
సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తది
హైదరాబాద్ అభివృద్ధి అందరికి కనిపిస్తోంది కానీ.. విపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు. భాగ్యనగరంలో ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ అన్నారని గుర్తు చేశారు. ఆ పార్టీ టికెట్లు ఢిల్లీలోనే కాకుండా.. బెంగుళూరులోనూ డిసైడ్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని.. సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుందని చెప్పారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని కోరారు. మోదీ, రాహుల్ కాదని వ్యాఖ్యానించారు.