mt_logo

కాంగ్రెస్‌ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో.. అని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎలాగూ గెలిచేది లేదని, పేజీలకు పేజీలు రాశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం.. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. 420 మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రజల ముందుకు తెచ్చిందని ఎద్దేవా చేసారు. 

మేనిఫెస్టోను కాపీ కొట్టిన కాంగ్రెస్ 

జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తమని మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. ఈ ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్నదా? అని ప్రశ్నించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే అని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని మండిపడ్డారు. అప్పులు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా ఈటెల రాజేందర్ అని అడిగారు. రెండేళ్లు ఆరోగ్య మంత్రిగా చేశావ్..  అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నవ్. గొప్పొడు అన్నవ్. పార్టీ మారంగనే మాట మార్చావ్ అని అడిగారు. గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా?  ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్నావ్. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు అని ధ్వజమెత్తారు.