
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో స్పందించారు. ఎటువంటి నీటి లభ్యత లేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దాని కింది ఆయకట్టు, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. దీనిని గమనించి సీఎం కేసీఆర్ 216 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారని మంత్రి అన్నారు.
వాళ్లు ముందు జూరాల నుంచి మొదలుపెట్టాలి అని వాదించారు… తర్వాత అటవీ ప్రాంతం అని ఫిర్యాదులు పెట్టారని గుర్తు చేశారు. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తర్వాత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అనంతరం రైతుల పేరు మీద కేసులు వేయించారు. అన్ని విజ్ఞాలను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని అన్నారు
తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం
జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉన్నది. రీడిజైన్ చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే ఉన్నాయన్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నది తుంగభద్ర బేసిన్, శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి చేపట్టడం మూలంగా ఈ నీరు కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
పిల్లి శాపాలకు ఉట్లు తెగవు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద వీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవని స్పష్టం చేశారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవన్నారు. వీరికి పాలమూరుకు నీళ్లు రావాలి, ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడాలి అన్నదానికన్నా ప్రాజెక్టు విఫలం కావాలి అన్న ఆకాంక్ష ఎక్కువగా ఉన్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏవయినా అవరోధాలు వస్తే నీళ్లొస్తే బాగుపడతారు అని ప్రజలను జాగృతం చేసి సహకరించాలి.. లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలు అన్నీ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో పనులు నడుస్తున్నాయి, పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 250కి పైగా మోటార్లు బిగించబడ్డాయని తెలిపారు.
పెంటా రెడ్డి మీద కూడా బురదజల్లుతున్నారు
ఇతర దేశాల నుంచి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు. కానీ సుధీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీర్, తెలంగాణ గర్వించదగిన ఇంజనీర్ అయిన పెంటా రెడ్డి మీద కూడా వీరు బురదజల్లుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం ఇప్పుడు విషం చిమ్ముతున్న నాయకులు విస్మరించడం గమనార్హమన్నారు. మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నాం అని గుర్తు చేశారు.
60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా కేసీఆర్ నాయకత్వంలో నిలదొక్కుకుంటున్నదన్నారు. పాలమూరుకు నీళ్లొస్తే ప్రతిపక్ష నాయకుల రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని విషప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.