mt_logo

కాంగ్రెస్‌ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు

కాంగ్రెస్ నాయకులు పోటీపడి మరీ అబద్ధాలు చెబుతున్నారని.. పార్టీలో అబద్దాల పోటీ జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైంది. అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పోటీ పడుతున్నారు అని పేర్కొన్నారు.

నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత బెట్టారు. వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమే. డిసెంబర్ 9నే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు.

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారు అని హరీష్ తేల్చి చెప్పారు.

నిన్న నిరుద్యోగ భృతి పై ఎగవేత.. నేడు రైతు రుణ మాఫీపై దాటవేత ధోరణి.. కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవే సాక్ష్యాలు అని ధ్వజమెత్తారు.