mt_logo

రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్‌గిరిలో పోటీకి రావాలి. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పోటీకి వస్తే మా అభ్యర్థిని బతిమిలాడుకొని నేను పోటీలో నిలబడతా అని అన్నారు.

అంత పెద్ద ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తర్వాత కూడా రేవంత్ రెడ్డి బయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి పిరికోడు.. మాటలు ఎక్కువ చెప్తాడు కానీ.. సవాలు స్వీకరించే దమ్ములేదు. మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలని నేను విసిరిన సవాలు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయాడు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

నా సవాలు పైన ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడడం లేదు. మల్కాజ్‌గిరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి ముఖ్యమంత్రి మౌనం వహించారు అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో లంక బిందెల సంగతేమో కానీ.. హైదరాబాద్ నగరంలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. లంకెల బిందెల కోసం తట్ట, పారాలు పట్టుకొని, అర్ధరాత్రి చీకట్లో కరుడుగట్టిన దొంగలు తిరుగుతారు. ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల ప్రజలు సిగ్గుపడుతున్నారు అని విమర్శించారు.

రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి.. నరేంద్ర మోడీని చౌకీదారు చోర్ హై అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడే భాయ్ అంటున్నాడు.. అదాని ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. రేవంత్ రెడ్డి హమారా ఫ్రెండ్ హై అంటున్నాడు. మా తెలంగాణ మోడల్ కాదు.. గుజరాత్ మోడల్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండు.. గుజరాత్ మోడల్ అంటే గోద్ర హింస చేస్తారా… బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల పైకి నడిపిస్తాడా రేవంత్ రెడ్డి చెప్పాలి.. నువ్వు రాహుల్ గాంధీ మనిషివా.. నరేంద్ర మోడీ మనిషివా.. బీజేపీ మనిషివా.. కాంగ్రెస్ నేతవా.. రేవంత్ రెడ్డి చెప్పాలే అని అడిగారు

ఒక్క ఓటు కాంగ్రెస్‌కు వేసినా, అది నేరుగా బీజేపీకి లాభం జరుగుతుంది. 30- 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు ఇదే జరుగుతుంది. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పట్లేదు అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి తిరగని పార్టీ దేశంలో లేదు. ఏబీవీపీ నుంచి టీఆర్ఎస్‌కి, టీఆర్ఎస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్‌కి, కాంగ్రెస్ నుంచి మళ్లీ మాతృ సంస్థకి బీజేపీకి వెళ్తాడు అని వ్యాఖ్యానించారు.

అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ అన్యాయం అంటాడు కానీ అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కరెక్టే అంటాడు.. రాహుల్ గాంధీ కరెక్టా లేదా రేవంత్ రెడ్డి కరెక్టా అనేది కాంగ్రెస్ చెప్పాలి అని అన్నారు.

ఆరు గ్యారంటీలు పోయినవి… ఆరు గారడీలు మోపైనై. రేవంత్ రెడ్డి స్కాములు, స్కీములు, ట్యాపింగ్ పేర్లతో డ్రామాలు ఎందుకు.. పాలన చేతకావడం లేదు కాబట్టే లీకువీరుడిగా మారిండు.. ఆరు గ్యారంటీలు అడిగి తంతారనే భయంతో ఈ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుండు అని విమర్శించారు.

ఈరోజు పోటీ.. పదేండ్ల నిజానికి.. వందరోజుల అబద్దానికి.. పదేళ్ల విషం బీజేపీకి మధ్య జరుగుతున్న పోటీ. ఇచ్చిన హామీలను నెరవేర్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అనే నిజం ఒకవైపు.. ఇచ్చిన హామీలన్నింటిని పక్కనపెట్టి అబద్ధాలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు.. 10 సంవత్సరాలుగా సమాజంలో విషయం నింపుతున్న బీజేపీ ఇంకోవైపు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో చిక్కుకున్నా.. కరువుతో సతమతమవుతున్నా.. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా… ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి పైన యువత కోపంగా ఉన్నారు. రాష్ట్ర రైతాంగము, ఆపద పాలైన ఆటో డ్రైవర్లు, పెన్షన్ రెట్టింపు కానీ వృద్ధులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రూ. 2,500 కాంగ్రెస్ హామీ రాని మహిళలు ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉన్నాయి అని తెలిపారు.

రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని యూట్యూబ్‌లో అడ్డగోలుగా పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన మొరిగే కుక్కల పైన మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు… ఓటు ద్వారానే బుద్ధి చెబుతాం.. ఓటుతోని ఇలాంటి సన్నాసుల పైన వేసే వేటే సమాధానం కావాలి అని పిలుపునిచ్చారు.