mt_logo

రేవంత్‌కు దమ్ముంటే హరీష్ రావు సవాల్‌కు స్పందించాలి: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే. తాను ఇంఛార్జ్ ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని సీఎం బాధ్యతలు నుంచి తప్పుకున్నారు అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దెర మాటలు. ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైంది. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలి.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్ – 1 రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టిండు అని విమర్శించారు.

దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు.. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నాడు అని దుయ్యబట్టారు.

కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదు.. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు? మోడీ నాయకత్వంలోనా? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో చేరతాడు. ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట చెప్పిన సరే ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదు అని ప్రశ్నించారు.

వంద రోజుల్లో చేస్తా అన్న పనిని కనీసం 250 రోజుల్లో అయినా తర్వాత కూడా చేయవా రేవంత్ రెడ్డి? అందుకే రేవంత్ రెడ్డిని స్పందించాలి అని హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. దమ్ముంటే హరీష్ రావు గారి సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించాలి.. ఆయన మోసం పార్ట్-2 ఇది.. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదు అని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. ఆయన ఏ సవాలుకి కట్టుబడి ఉన్నాడో చెప్పాలె? గతంలో కొడంగల్‌లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిసారి మాట తప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నా. ఇతర చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మాకు ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో గెలుస్తున్నారు అని అభిప్రాయపడ్డారు.

మల్లారెడ్డి గారు రాజకీయ అనుభవంతో వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారు.. ఈటెల రాజేందర్‌ని మునగ చెట్టు ఎక్కిచ్చి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారు. మల్కాజ్‌గిరిలో ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే.. అది ఈటల రాజేందర్‌కి కూడా తెలుసు. మల్లారెడ్డి గారు అన్న మాట అంతరార్థం తెల్వక కొంతమంది ఆగమవుతున్నారు అని కేటీఆర్ అన్నారు.

కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన సరే.. శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యం. బీఆర్ఎస్‌లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు అని వ్యాఖ్యానించారు.