mt_logo

పారిశుధ్య నిర్వహణ, పలు ఇతర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు,  మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు. రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత త్రాగునీటి సరఫరా, వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన ప్రధానంగా ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చర్చించారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయక సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖల తోనూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచన  అధికారులందరికీ సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశామన్నారు మంత్రి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి, అవసరమైతే సాగునీటి శాఖ తో మాట్లాడి  ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించండని సూచించారు. 

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించండి,  సహాయక కార్యక్రమాలు ఎలాంటి అవసరం ఉన్న స్వయంగా నా కార్యాలయం తో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యల పైన ఎక్కువ దృష్టి సారించండని చెప్పారు. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచన చేసారు. పట్టణాల్లో ముఖ్యంగా ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలి,  పట్టణాల్లో ఉన్న రహదారులను వెంటనే మోటరబుల్ గా తయారు చేయాలి, దీని కోసం అవసరం అయిన తాత్కాలిక మరమత్తులు చేపట్టాలన్నారు. 

ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ని చేపట్టాలి, అదనంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలి. అవసరమైతే అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని చెప్పారు. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పారు. పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు డి వాటరింగ్ పంపులను కూడా వినియోగించండన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలన్నారు. ప్రజలు తాగునీటిని కాచి వడపోసుకొని వినియోగించాలని అవగాహన వచ్చే చర్యలు తీసుకోవాలని సూచించారు. 

 సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడం, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలి, వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. పట్టణాల్లో ఉన్న బస్తీ దావఖానాలు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. DMHO లతో సమన్వయం చేసుకుని అవసరమైన వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. మిగిలిపోయిన శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలన్నారు. విద్యుత్ శాఖ తో జాగ్రత్తగా సమన్వయం చేసుకుని మరమత్తు కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు.