mt_logo

సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.

వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోంది. వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్య రెడ్డి, నందాల సాయికిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్‌లకు, వారి తల్లితండ్రులకు శుభాభినందనలు అని కేటీఆర్ పేర్కొన్నారు.

సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావటమనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త. ప్రతిష్టాత్మక సివిల్స్‌లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మన విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉంది అని తెలిపారు.

సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.