అసెంబ్లీలో మీడియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ మాటలతో ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేదని తేలింది. హెచ్ఎండీఏ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉంది. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు.. దానికి అ మేరకు స్వతంత్రత ఉంది అని తెలిపారు.
లంచ్ మోషన్ పిటీషన్పైన కోర్టు తెలుస్తుంది. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకుపోతే వాళ్ల ఇష్టం. న్యాయపరంగా ఎదుర్కొంటాం అని పేర్కొన్నారు.
టీఓటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉంది. టీఓటీ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించాం. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీఓటీ విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించాం అని కేటీఆర్ అన్నారు.
ప్రయివేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్ ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు. లక్ష కోట్ల అవినీతి అని గతంలో అవుటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన అడ్డగోలు మాటలపైన హెచ్ఎండీఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డిపైన హెచ్ఎండీఏ వేసిన కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డుపైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు. మరి కుంభకోణం అంటున్న అవుటర్ రింగ్ రోడ్డు లీజ్ను ఎందుకు రద్దు చేయడం లేదు అని అడిగారు.
రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వెంటనే రద్దు చేసి.. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలి. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే.. ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీ కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదు అని ప్రశ్నించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారు. జడ్జి ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాం. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి. పదివేల కోట్ల రూపాయల కుంభకోణం అంటున్న కోకాపేట భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి అని డిమాండ్ చేశారు.
స్పీకర్, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఎలా అని ప్రభుత్వం సభ్యులకు శిక్షణ ఇచ్చారా? అని కేటీఆర్ దుయ్యబట్టారు.