తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి గారు అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ గారిని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేటీఆర్ గారు తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారు. వారికి అభినందనలు అని తెలిపారు.
హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్ల కేసని తేటతెల్లమైంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల మాట్లాడారు. గోబెల్స్ ప్రచారం చేసారు. ఈ కార్ రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని అడిగాం. వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని అడిగినం. స్పీకర్ గారిని మొన్నే కలిసి అడిగాం. ఈరోజు సభలో అడిగాం. మమ్మల్ని బయటకు పంపి సభలో చర్చ కొనసాగించారు అని విమర్శించారు.
కేసు పెట్టవద్దు అని మేం అడగటం లేదు, చర్చ పెట్టండి అని అడిగాం.. ఎందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా. ఫార్ములా-ఈ రేసులో రూ. 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. మిగతా 50 శాతం చెల్లించకపోవడం వల్ల రద్దు చేసుకుంటున్నాం, అందుకు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నం అని సదరు సంస్థ చెప్పింది. 45 లక్షల పాండ్స్ అంటే సుమారు రూ. 47 కోట్లు కాని రేవంత్ రెడ్డి గారు రూ. 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పిండు అని దుయ్యబట్టారు.
వాస్తవానికి రూ. 700 కోట్ల లాభం రాష్ట్రానికి జరిగింది. రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల రూ. 700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ వల్ల ఆరేడు వందల కోట్లు హైదరాబాద్కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పింది రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం. రాష్ట్ర ఇమేజ్ని దెబ్బ తీసిండు రేవంత్ రెడ్డి. అసలు కేటీఆర్ గారి మీద కేసు ఎందుకు పెట్టారు.. అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టింది అని హరీష్ రావు అడిగారు.
రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారు. ఇందులో అవినీతి ఏముంది. ప్రొసీజురల్ లాప్స్ జరిగినయి కావొచ్చు, అవినీతి లేదు. పొన్నం ప్రభాకర్ గారే నిన్న అవినీతి జరగలేదు, ప్రొసీజురల్ లాప్స్ జరిగింది అన్నడు. వస్తు రూపేనా, ధన రూపేనా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తది. మే బీ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ అని పేర్కొన్నారు.
2022లో ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు చూసారు.. తెలంగాణ ఖ్యాతి పెరిగింది. రూ. 42 కోట్లతో తమిళనాడులో ఫార్ములా 4 నిర్వహించింది, ఉత్తర్ప్రదేశ్ రూ. 1700 కోట్లతో ఫార్ములా వన్ నిర్వహించింది. రూ. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ రూ. 70 వేల కోట్లతో నిర్వహించారు.. అదొక స్కాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు కేటీఆర్ గారిని అభినందించారు అని గుర్తు చేశారు.
అలవిగాని హామీలిచ్చి రేవంత్ ప్రజలను మభ్యపెట్టిండు. ముఖ్యమంత్రి అయితే అయ్యిండు గానీ, ఆయన ఇచ్చిన హామీలు ఎట్ల అమలు చెయ్యాలె అని తలుచుకొని భయంల పడ్డడు. ఎట్లనన్న గట్టెక్కాలె. తిమ్మిని బమ్మిని చెయ్యలె అనే ఆలోచనతో హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రమే దివాళా తీసిందనే దివాలాకోరు ప్రచారం మొదలుపెట్టిండు. రాష్ట్రం దివాల తీసింది అన్నడు. పెట్టుబడులు రావటం లేదు. దివాలా దివాలా అని తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డడు. ఏడు లక్షల కోట్ల అప్పు కాదు, నాలుగు లక్షల 17 వేల కోట్ల అప్పే అని శాసనసభ సాక్షిగా నోరు మూయించినం. గ్యారెంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. రాష్ట్ర పరపతి, ప్రతిష్టను దెబ్బతీసిండు అని దుయ్యబట్టారు.
మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన్రు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది. ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు.. ఇచ్చిన హామీలు ఏమైనయి అంటే చాలు అరెస్టులు.. రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు అని ఆక్షేపించారు.
ఏం చేసిండు మా కేటీఆర్ గారు.. నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నడు.. నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నడు. నీతో సహా నీ బ్రదర్స్, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నడు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీ ఆర్ఆర్ బ్రదర్స్ గురించే ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నువ్వు చేస్తున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టి, నీకు వశపడక. ఏదో ఒక కేసు పెట్టాలె, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్రకు కొన్ని నెలలుగా తెరలేపినవు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్ను భయబ్రాంతులకు గురిచేసి నీ కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నవు అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
కేటీఆర్ చేసిన తప్పేంది.. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా-ఈ రేసును హైదరాబాద్కు తెచ్చిండు. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్కి డెస్టినేషన్గా మార్చాలనుకున్నడు.. అది కేటీఆర్ తప్పా? అని ప్రశ్నించారు.
2023లో రూ. 30 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో ఫార్ములా-ఈ రేసు నిర్వహిస్తే, రాష్ట్ర జీఎస్డీపీకి రూ. 700 కోట్లు సమకూరిందని నీల్సన్ అనే ప్రతిష్టాత్మకమైన సర్వే సంస్థ చెప్పింది. సాధారణంగా ఇలాంటి రేసులకు సంబంధించి హోటళ్లకు 12 శాతం జీఎస్టీ ఉంటది. రేసులకు 28 శాతం జీఎస్టీ ఉంటది. సగటున తీసుకున్నా రూ. 700 కోట్లకు గాను జీఎస్టీ కింద సుమారు 20 శాతం జమ అయి ఉంటది. అందులో 10 శాతం నేరుగా రాష్ట్ర ఖజానాకు వస్తది. ఇంకో 10 శాతం కేంద్రం ఖజానాకు పోతది. అంటే రాష్ట్రం రూ. 30 కోట్లు పెట్టుబడి పెడితే రూ. 70 కోట్ల జీఎస్టీ రాష్ట్ర ఖజానాకు, మరో రూ. 70 కోట్లు కేంద్ర ఖజానాకు వెళ్లింది. కేంద్రానికి వెళ్లిన రూ. 70 కోట్లలో రాష్ట్రవాటా కింద 2.102 శాతం డెవల్యూషన్ కింద సుమారు కోటిన్నర రూపాయలు మళ్లీ రాష్ట్ర ఖజానాకే వస్తయి.. అంటే కేటీఆర్ చేసింది ఏంటి.. రూ. 30 కోట్లు ఖర్చు చేసి రూ. 71.50 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూర్చిండు. అది తప్పా? అని అడిగారు.
ఇదే ఈవెంట్ మూడేళ్లు నిర్వహించేందుకు గాను ప్రభుత్వంతో ఒప్పందం కుదిర్చిండు. ఎలక్షన్ కోడ్ వయొలేషన్ ఉంది అన్నడు. నిర్ణయం ఏడాది క్రితం అయ్యింది. ఎన్నికల కోడ్ రాకముందే అంతా జరిగింది. ఆన్ గోయింగ్ ప్రాసెస్కు కోడ్ ఉండదు. ఒక వేళ ఉంటే ఎలక్షన్ కమీషన్ చూస్తది. ఏసీబీకి ఏం సంబంధం. ఏ1 కేటీఆర్, ఏ2 అధికారి, అయితే ఆ కంపెనీ మీద ఎందుకు పెట్టలేదు అని అడిగారు.
మొన్న సాయంత్రం 5 గంటలకు దానకిషోర్ గారు ఫిర్యాదు చేసారు. 24 గంటలు జరగకముందే కేసు పెట్టారు. దీని వెనుక కుట్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టమయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు. ఆ డైవర్షన్లో భాగమే.. కేటీఆర్ మీద పెట్టిన కేసు అని విమర్శించారు.