mt_logo

ఎన్నికలు కాగానే మేడిగడ్డ నీళ్ళు మనమే పోరాడి మలుపుకుందాం.. రైతులతో కేసీఆర్

పచ్చని పంటలను ఎండబెట్టి రైతుల ప్రాణం తీసేటందుకే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటలకు నీళ్లిచ్చి రైతులను బతికిచ్చే సోయిలేదని, కాళేశ్వరం నీళ్లను తమ పంటపొలాలకు మలుపుకునేందుకు రైతులే యుద్ధానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ఈ దిశగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

ఎండిపంటలను సందర్శించి రైతులకు భరోసా నింపే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రైతులను కేసీఆర్ శుక్రవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా మగ్దుంపూర్ పర్యటనలో రైతులను కలిసి భరోసా నింపారు.

ఈ సందర్భంగా పంటలు ఎండిన రైతులు కేసీఆర్ తో మాట్లాడుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. విత్తనాలు, ఎరువులు వేసి ఎకరానికి 40 వేల దాకా ఖర్చుపెట్టి ఏపుగా పెంచుకున్న పచ్చని పంట ఒక్క ఆఖరి తడి అందక నిలబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.. “ఒక్కటే ఒక్క ఆఖరి తడికి నీళ్లు వదిలివుంటే వేల ఎకరాల పంట అక్కరకొచ్చి పుట్ల కొద్దీ పండేది.” అని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్లిస్తామని చెప్పి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చిందని, గత పడేండ్లనుంచి ఏనాడు ఇంతటి దారుణ పరిస్థితి చూడలేదని రైతులు వాపోయారు. నిరుడు ఇదే పొలంలో మోకాళ్లలోతు బురదవుండేదని ఇప్పుడు ఎర్రగ ఎండి నెర్రె బాసిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎండుతున్న పంటలకు నీళ్లిచ్చే ఆలోచన లేదని.. పోరాడి పంటలకు నీళ్లు మలుపుకుందామని రైతులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అందుకు పోరాటానికి సిద్దంగా ఉండాలన్నారు.

“మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చెడొద్దు. మనం ఎన్నికలు అయినంక ఓ పదివేల మంది రైతులం మేడిగడ్డ పోదాం. అక్కడ నుంచి నీళ్లు మన పంట పొలాలకు ఎట్లా రావో సూద్దాం. మీరు పోరాటానికి సిద్ధంగా ఉండండి.” అని ధైర్యాన్నిచ్చారు.