mt_logo

కేసీఆర్ బర్త్‌డే: ఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా పత్రాలు, దివ్యాంగులకు వీల్ చైర్లు అందించిన కేటీఆర్

తెలంగాణ ఉద్యమ సారధి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సీనియర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ఈరోజు జరిగిన ఈ సంబరాల ఏర్పాట్లను, నిర్వహణను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ చేశారు.

ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జన్మదిన వేడుకల సందర్బంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ఒకొక్కరికి లక్ష రూపాయల కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను, 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా కేసీఆర్ 70 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్‌ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు.

అనంతరం కేసీఆర్ జీవిత, రాజకీయ, తెలంగాణ ఉద్యమ నేపధ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన అతనే ఒక చరిత్ర డాక్యుమెంటరీని వీక్షించారు. ఎంతో గొప్పగా డాక్యుమెంటరీని చేశారని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్‌ను కేటీఆర్ ఆలింగనం చేసుకొని అభినందించారు. భవన్ ఆవరణలో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఆమరణ దీక్ష విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీమంతరులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది బీఆరెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద భీమా క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.