mt_logo

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటుకు జీవో జారీ

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గాను ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలుకై వచ్చే ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఆయా ప్రతిపాదనలకు సంబంధించి సంబంధిత కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఎంసీసీ అమలు ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించి ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి  ప్రతిపాదిస్తుందని నేడు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 1414 లో పేర్కొన్నారు. 

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటుకు జీవో నెం.1414 జారీ చేసింది. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియంత్రణ, అమలుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించడానికి సంబంధిత శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగానికి చెందిన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిషన్ కు ప్రతిపాదించే అంశాలపై కమిటీ సభ్యులు పరిశీలించి తగు నిర్ణయాల కోసం ఎలక్షన్ కమిషన్‌గా ప్రతిపాదిస్తారు.