mt_logo

 ‘తెలంగాణ ప్రముఖ కవులు – కావ్యాలు’ పుస్తక సంపుటి ఆవిష్కరణ

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంచాలకులు మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘తెలంగాణ ప్రముఖ కవులు – కావ్యాలు’ పుస్తక సంపుటిని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులు, రచయితలు, కళాకారులు, చరిత్రకారులు, సాహితీవేత్తలను గుర్తించి వారిని గౌరవిస్తున్నామన్నారు. వారి పేర్ల తో అవార్డులను అందజేస్తున్నామన్నారు.  జయంతి, వర్ధంతిలను  అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  భాషాభివృద్ధికి, సాహిత్య అభివృద్ధికి, కళా రంగాల అభివృద్ధికి, నాటక రంగాల అభివృద్ధికి, కళా రంగాల  ప్రోత్సాహానికి, అకాడమీలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య సేవ కు పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ గారి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ ప్రాంతంలోని క్రీస్తు శకం 941 సంవత్సరంలోని పంపన్న కవి కాలం నుండి 1975వ సంవత్సరం వరకు జన్మించిన కవులు వారి కావ్యాల పరిచయం – విశ్లేషణ లను ఈ పుస్తకంలో సవివరంగా పొందుపరిచారని మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ రచయితను అభినందించారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది కవులు ఉన్నారన్నారనీ సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రిక ద్వారా చాటి చెప్పారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతం పై ఉన్న వివక్ష కారణంగా అనేక కావ్యాలు, గ్రంధాలు కాలగమనంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సాహిత్య చరిత్రను వెలికి తీసి భవిష్యత్ తరాలకు పుస్తకాల, గ్రంధాల రూపంలో అందించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.